J&K’s Pahalgam tourism rebounds: మన దేశంలో చూడాల్సిన అందమైన ప్రదేశాల్లో జమ్మూకశ్మీర్ లో ఉన్న పహల్గామ్ ఒకటి. మంచుపరుచుకున్న పర్వతాలు, పచ్చని లోయలు, కట్టిపడేసే ప్రకృతి కారణంగా ఈ ప్రాంతానికి మినీ స్విట్జర్లాండ్ అని పేరు వచ్చింది. ఇది అనంతనాగ్ జిల్లాలో ఉంది. ట్రెక్కింగ్ చేసేవారికి ఈ ఫ్లేస్ స్వర్గధామమనే చెప్పాలి. పవిత్రమైన అమర్నాథ్ యాత్ర ఇక్కడ నుండే మెుదలవుతుంది. ఈ యాత్రకు పహల్గామ్ ప్రవేశద్వారంగా చెబుతారు. ఇది లిడ్డర్ నది ఒడ్డున ఉంటుంది.
అయితే ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు ఆరాచకం సృష్టించారు. ముఖ్యంగా పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. అయితే భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింథూర్’ పేరిట ఆపరేషన్ నిర్వహించి పాక్, పీవోకేలో గల పదుల సంఖ్యలో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, అనేక మంది టెర్రరిస్టులను మట్టుబెట్టి విజయకేతనం ఎగురవేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో.. పహల్గామ్ కు మళ్లీ టూరిస్టులు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
గత కొన్నిరోజులగా ఉన్న కర్ఫ్యూను ప్రభుత్వం ఎత్తివేయడంతో మినీ స్విట్జర్లాండ్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. దేశ విదేశాలను భారీ సంఖ్యలో సందర్శకుల వస్తున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు అక్కడ హోటళ్లు ప్రత్యేక డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాయి. ఇప్పటికే సీఎం రెండుసార్లు అక్కడ పర్యటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టూరిస్ట్ల రాకతో బైసరాన్ వ్యాలీ సరికొత్త శోభను సంతరించుకుంది. రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. పర్యాటకులతో కళకళ్లాడుతున్న పహల్గామ్ ను చూసి ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ఆనందం వ్యక్తం చేశారు. కాశ్మీరీలో పహల్గామ్ అంటే ‘‘గొర్రెల కాపరుల గ్రామం’’ అని అర్థం. దీనికి ”ఎద్దుల గ్రామం” అనే మరో పేరు కూడా ఉంది.