KS Latha Kumari Hasanamba Temple: కర్ణాటకలోని హసనాంబ ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా అక్కడ నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షించడమే కాదు. ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ దైవం పట్ల తన భక్తిని చాటుకున్నారు ఓ ఐఏఎస్ అధికారిణి. హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ) కేఎస్ లతా కుమారి, ప్రసిద్ధ హసనాంబ ఆలయంలో జరిగిన అగ్నిగుండం (కెండోత్సవం) కార్యక్రమంలో పాల్గొన్నారు. నిప్పులపై నడిచి తన భక్తిని చాటుకున్నారు. కాగా, హసనాంబ ఆలయ వార్షికోత్సవాలు బుధవారం రాత్రితో ముగిశాయి.
Also Read: https://teluguprabha.net/viral/chikni-chameli-song-insta-girl-viral-video/
ఉత్సవాల ముగింపు సందర్భంగా, గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా ‘కెండోత్సవం’ కార్యక్రమం జరిగింది. ఏడాది పాటు ఆలయ గర్భగుడిని మూసివేసే ముందు ఈ క్రతువును జరపడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో డీసీ లతా కుమారి స్వయంగా పాల్గొని, నిప్పులపై భక్తి పారవశ్యంతో నడిచారు. ఆమె నిప్పులపై నడుస్తున్నంతసేపు అక్కడున్న భక్తులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేసి ప్రోత్సహించారు.
భక్తులు పవిత్ర కలశాలు పట్టుకుని నిప్పులపై నడుస్తుండటం చూసి తనకు స్ఫూర్తి కలిగిందని లతా కుమారి అన్నారు. ఇంతకుముందెప్పుడూ తాను ఇలా నిప్పులపై నడవలేదని.. మొదట కొంచెం భయపడినా.. తర్వాత దేవుడిపై విశ్వాసంతో దండం పెట్టుకుని నడిచేశానని చెప్పుకొచ్చారు.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో 13 రోజుల పాటు జరిగిన ఈ చారిత్రక హసనాంబ జాతర మహోత్సవం జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులతో సహా సుమారు 26 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని సమాచారం. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా ఆలయానికి దాదాపు రూ. 20 కోట్ల ఆదాయం సమకూరినట్లు అంచనా. భక్తుల సంఖ్య, ఆదాయంపై అధికారులు అధికారికంగా ప్రకటించాలి. కాగా, ఏడాది పాటు మూసి ఉంచే ఈ ఆలయ గర్భగుడిలో పెట్టిన నైవేద్యాలు, పూవులు మరుసటి ఏడాది తలుపులు తెరిచే వరకు తాజాగా ఉంటాయని భక్తులు చెబుతున్నారు. అలాగే, గర్భగుడిలోని దీపం కూడా ఏడాది పొడవునా వెలుగుతూనే ఉంటుందని భక్తులు బలంగా నమ్ముతారు.


