Man sets fire to a moving train in Seoul: తనకు విడాకులిచ్చిందని కోపంతో రగిలిపోయాడు ఓ భర్త. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మైట్రో రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సౌత్ కొరియాలోని సోల్ నగరంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది. చూడటానికి భయానకంగా ఉన్నాయ్ ఆ దృశ్యాలు. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.
అసలేం జరిగిందంటే..
దక్షిణ కొరియా సియోల్ కు చెందిన 67 ఏళ్ల వాన్ రీసెంట్ గా తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు మే 31న సియోల్లో సబ్వే లైన్ 5లో ఉన్న మెట్రో రైలు ఎక్కాడు. ట్రైన్ రన్నింగ్ లో ఉన్న సమయంలో తనతో తెచ్చుకున్న పెట్రోల్ రైలులో పోసి నిప్పంటించాడు. మంటలు భారీగా ఎగసపడటంతో ప్యాసింజర్స్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పటికే ఆ రైలు యౌయినారు, మాపో స్టేషన్ల వైపు వేగంగా దూసుకెళ్తోంది. ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఉదయం 8:42 గంటలకు రైలు హాన్ నది కింద సముద్రగర్భ సొరంగం గుండా వెళుతుండగా మంటలు చెలరేగాయి.
దీనికి సంబంధించిన దృశ్యాలు రైలులోని సీసీటీవీలో రికార్డు చేయబడ్డాయి. అవి కాస్త బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 23 మంది పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 129 మందికి అత్యవసర వైద్య సహాయం అధికారులు అందించారు. అతడు చేసిన పనికి సుమారు రెండు కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.