Rich Indians Leave India due to pollution: భారత్లోని సంపన్నులు స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లడానికే ఆసక్తి కనబరుస్తున్నారని ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ అక్షత్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇందుకు గల కారణాలపై విశ్లేషించినట్లు తెలిపారు. ముఖ్యంగా భారత్లో క్షీణిస్తున్న జీవన పరిస్థితులు, గాలి నాణ్యత, పొల్యూషన్ కారణంగా స్వదేశంలో ఉండటానికి ఇష్టపడటం లేదని.. తమ ముందు తరాలకు మంచి నాణ్యమైన జీవితం అందించేందుకు విదేశాలను ఎంచుకుంటున్నారని గమనించినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రతపై ఆర్థిక సలహాదారు, కంటెంట్ సృష్టికర్త అక్షత్ శ్రీవాస్తవ చేసిన వైరల్ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దేశం విడిచి ఎలా వెళ్లాలో మార్గదర్శకత్వం కోరుతూ సంపన్న భారతీయుల నుంచి తనకు ప్రైవేట్ మెసేజ్లు పెరుగుతున్నాయని ఆయన పేర్కొనడం భారత్లో పరిస్థితులపై ఆందోళన కలిగిస్తోంది. భారత్లో సంపన్నులు బతకడానికి పన్ను ప్రయోజనాలు కారణం కాదని.. అందుకు బదులుగా స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన జీవన పరిస్థితులు, వారి పిల్లలకు మెరుగైన అవకాశాలను కోరుకుంటున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో మెరుగైన జీవన పరిస్థితులు మరింత అత్యవసరంగా మారాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘భారతదేశం నుంచి బయటకు వెళ్లడంపై ధనవంతులైన భారతీయులు ఎంతమంది నన్ను ప్రైవేట్గా సంప్రదిస్తారో నేను మీకు చెప్పలేను. వారి లక్ష్యం తప్పనిసరిగా పన్ను ఆదా చేయడం కాదు. పిల్లలకు మెరుగైన జీవనశైలి, స్వచ్ఛమైన గాలి, భద్రత, మెరుగైన అవకాశాలు అందించడమే వారి కోరిక.’ అని పోస్ట్ చేశారు.
కానీ ధనవంతులు దేశం వదిలి వెళ్ళిపోయినప్పుడు, వారు ఒక శూన్యతను వదిలి వెళతారని శ్రీ వాస్తవ అన్నారు. తద్వారా దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక పరిణామాలు ఉంటాయని తెలిపారు. 2% కంటే తక్కువ మంది భారతీయులు ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఒక ధనవంతుడు వెళ్ళిపోతే, అది మరొక 98% మందికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. ప్రజలకు ఈ సాధారణ విషయం అర్థం కాలేదన్న ఆయన.. న్యాయవ్యవస్థ, కాలుష్యం, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘దేశంలో ఈ సమస్యలు కొత్తవి కావు, కానీ సామాజిక ఐక్యత మరింత క్షీణించింది. గతంలో కనీసం సామరస్యం ఉండేది. ఇప్పుడు ఏంటి? ఏమీ లేదు. గాలి నాణ్యత మరింతగా దెబ్బతిన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ధనిక భారతీయుల “నిశ్శబ్ద నిష్క్రమణ” విచ్ఛిన్నమైన వ్యవస్థ పట్ల సామూహిక ఉదాసీనతను ప్రతిబింబిస్తుంది.’ అని శ్రీ వాస్తవ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఈ పోస్ట్పై సోషల్ మీడియాలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూజర్లు తమ అభిప్రాయాలను, పరిష్కారాలను పంచుకున్నారు.
‘భారత్లో అపరిశుభ్రమైన నగరాలతో పాటు పరిశుభ్రమైన ప్రాంతాలూ ఎన్నో ఉన్నాయి. దాదాపు 50 కలుషితమైన నగరాలపై అధికారులు చర్యలు తీసుకోవడం అవసరం. కానీ 100కి పైగా చిన్న నగరాలు ఉడిపి, మైసూర్, పాండిచ్చేరి, నాగ్పూర్, కొచ్చి వంటి ప్రదేశాల్లో పరిశుభ్రతను పరిశీలిస్తే.. దుబాయ్ కంటే ఈ ప్రాంతాలను మెరుగైన ఎంపికగా భావించవచ్చు.’ అని ఓ నెటిజన్ స్పందించారు.
అభివృద్ధి చెందిన దేశం అంటే కేవలం GDP లేదా సాంకేతికత కాదని.. అది భద్రత, అవకాశం, పౌరుల శ్రేయస్సు పట్ల గౌరవం అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. కాలుష్యం, నేరాలు, మౌలిక సదుపాయాలను కారణాలుగా చూపుతూ ధనవంతులు భారత్ను వదిలేయడం సరికాదన్నారు.

