TCS VS Employees: భారతదేశంలో అతి పెద్ద ఐటీ సేవల సంస్థకు పెట్టింది పేరు టీసీఎస్.అయితే గత కొద్ది నెలల నుంచి టీసీఎస్ ఏదోక కారణంతో వార్తల్లో ఉంటుంది. ఇటీవల లేఆఫ్స్ అంశం చుట్టూ చర్చలు సాగుతుండగా, ఇప్పుడు పూణేలో చోటుచేసుకున్న ఒక ఘటన మరింతగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి తన జీతం రాకపోవడంతో ఆఫీస్ ముందు ఫుట్పాత్పై నిద్రించడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఫుట్పాత్పైనే..
సౌరభ్ మోరె అనే ఉద్యోగి పుణేలోని టీసీఎస్ ఆఫీస్ గేటు సమీపంలో ఫుట్పాత్పైనే రాత్రి పూట నిద్ర పోతున్నాడు. అంతేకాకుండా అసలు తను ఇది ఎందుకు చేస్తున్నాడో, తన నిరసనను స్పష్టంగా తెలియజేయడానికి అతడు ఒక కాగితంపై వివరాలు రాసి తన పక్కన పెట్టుకున్నాడు. ఆ కాగితంలో, తనకు గత కొన్ని నెలలుగా జీతం రాలేదని, హెచ్ఆర్ విభాగానికి కూడా ఈ విషయం చెప్పినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నాడు. అంతేకాకుండా, జీతం ఆగిపోవడంతో డబ్బు లేకపోవడం వల్ల బయట ఫుట్పాత్పై పడుకోవాల్సి వస్తోందని రాసిపెట్టాడు.
జీతం నిలిపివేశారని…
ఆ కాగితం వివరాల ప్రకారం, అతడు జులై 29, 2025న సహ్యాద్రి ఐటీ క్యాంపస్లో హాజరైనప్పటికీ, తన ఐడీ యాక్టివ్ చేయలేదని, జీతం నిలిపివేశారని తెలిపారు. హెచ్ఆర్తో మాట్లాడినప్పుడు, రావలసిన మొత్తం త్వరలో చెల్లిస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా ఆయన ఆ కాగితంలో రాశారు.
సోషల్ మీడియాలో పోస్ట్…
ఈ విషయాన్ని ఎవరో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది తక్షణమే వైరల్ అయింది. ఫోటోపై అనేక మంది స్పందించి, కంపెనీ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టులు, కామెంట్ల రూపంలో విస్తృతంగా చర్చ జరగడంతో విషయం మరింతగా ప్రాధాన్యం సంతరించుకుంది.
సమస్య పెద్దదిగా మారకముందే, టీసీఎస్ ఈ ఘటనపై స్పందించింది. సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, ఆ ఉద్యోగి అనుమతి లేకుండా ఆఫీస్కి రాకపోవడం వల్లే కంపెనీ విధి విధానాల ప్రకారం పేరోల్ నిలిపివేశామని తెలిపారు. అయితే, సౌరభ్ మోరె తిరిగి విధుల్లో చేరేందుకు అభ్యర్థించడంతో, ప్రస్తుతం అతనికి తాత్కాలిక వసతి కల్పించామని, సమస్య పరిష్కారానికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అతడు ఆఫీస్ బయట లేడని, పరిస్థితిని సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో టీసీఎస్ ఆర్థిక పరిస్థితులపై కూడా చర్చ జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఫలితాల్లో సంస్థకు గణనీయమైన లాభ వృద్ధి కనిపించకపోవడంతో, వ్యయ నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అదే సమయంలో, దాదాపు 12,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించడం పెద్ద వార్తగా మారింది.


