Youth Harassed Women On MMTS Train In Mumbai: కొందరు ఆకతాయిలు చేసే స్టంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. సరిగ్గా ఇలాంటి స్టంట్ ఒకటి ముంబైలో జరిగింది. ఓ యువకుడు రైలులోని మహిళా ప్రయాణీకుల భోగీలోకి ఎక్కి హల్చల్ చేశాడు. వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీసులు సదరు ఆకతాయిపై కేసు నమోదు చేసి కటకటాల పాలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబై బోరివలి రైల్వే స్టేషన్లో ఒక యువకుడు మహిళల బోగీలోకి ప్రవేశించి వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా రన్నింగ్ ట్రైన్లో స్టంట్లు చేశాడు. ఈ ఘటన అక్కడి వారిని భయబ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటనను అక్కడున్న ఒక మహిళ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్గా మారింది. దీంతో, రైల్వే పోలీసులు వెంటనే స్పందించి ఆకతాయిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 11 వ తేదీ సాయంత్రం 6 :40 గంటలకు బోరివలి స్టేషన్ నుంచి ఒక రైలు బయలుదేరింది. ఈ సమయంలో ఒక మహిళా ప్రయాణికురాలు విరార్ నుంచి అంధేరి వైపు దాదర్ ఫాస్ట్ లోకల్లో మహిళా బోగీలో ప్రయాణిస్తుంది. బోరివలి స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన వెంటనే పక్కన ఉన్న లగేజ్ బోగీలో నిలబడి ఉన్న యువకుడు స్టంట్లు చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో అతడు మహిళా బోగీ వైపు చూస్తూ అసభ్యకరంగా మాట్లాడి మహిళలను వేధించాడు. ఈ సంఘటనను రైలులోనే ఉన్న మరో ప్రయాణికురాలు మొబైల్లో రికార్డు చేశారు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
ఆకతాయి ఆట కట్టించిన పోలీసులు..
వీడియో వైరల్ కావడంతో బీజేపీ మహిళా నేత చిత్రా వాఘ్ వెంటనే రైల్వే పోలీసులను చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన జీఆర్పీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సెప్టెంబర్ 29న బోరివలి ఆర్పీఎఫ్ సహకారంతో నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడి పేరు నతూ గోవింద హంసా(35)గా గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలోని వలసాడ్కు చెందినవాడని విచారణలో వెల్లడైంది. విచారణలో అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం కోర్టు అతడిని రిమాండ్కు పంపింది. బోరివలి జీఆర్పీ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ దత్త ఖుపెర్కర్ ఈ ఘటనపై స్పందిస్తూ మహిళా ప్రయాణికుల భద్రత తమకు ప్రథమ కర్తవ్యమని, మహిళను వేధించే ఆకతాయిలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను ఏమాత్రం సహించబోమన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.


