ప్రజల గొంతు వినే ఉద్దేశ్యం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP YS Avinash Reddy)అన్నారు. ప్రతిపక్షం ఉండేది కేవలం వైసీపీనేన్నారు. 11 సీట్లంటున్నారు కానీ 40 శాతం ఓట్లు వచ్చాయనేది మర్చిపోతున్నారా అని ప్రశ్నించారు. నలుగురు ఎంపీలున్నారు.11 మంది ఎమ్మెల్యేలున్నారు.
నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల గొంతు వినే ఉద్దేశ్యం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు. జగన్కి అందరు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యేల మాదిరిగా మైక్ ఇస్తే రెండు నిమిషాల్లో ఏం చెప్పగలరు..? అదే ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రి గంట మాట్లాడితే 40 నిమిషాలు ప్రతిపక్షనేత మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పారు.
ప్రజల గొంతుక అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే ప్రజల సమస్యలను వినిపించే అవకాశమే ఉండదన్నారు.జగన్ని అవమానిస్తున్నాం అని స్పీకర్, చంద్రబాబు అనుకుంటున్నారు కానీ ప్రజలను అవమానిస్తున్నారనేది మర్చిపోతున్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతోనే మేం అసెంబ్లీకి వెళ్లామని ఎంపీ అవినాష్ అన్నారు.
ప్రతిపక్ష నేతగా జగన్ వెళ్తే వీళ్లకి ఏ రకమైన సినిమా కనిపిస్తుందో వాళ్లకు తెలుసు. వాళ్లిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. జగన్ మొదలుపెడితే వీళ్ల వద్ద సమాధానం లేదు. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ప్రతిపక్షహోదా ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తున్నారన్నారు.
నిజంగా పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందనే ముచ్చట పడితే కూటమి గాలిలో 65 వేల ఓట్లతో బీటెక్ రవి ఓడిపోయాడన్నారు. వాళ్లకు అంత ముచ్చటగా ఉంటే పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం నాలుగు చోట్లా రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్దామన్నారు. ఈ 9 నెలల పాలనకు రిఫరెండంగా, సూపర్ సిక్స్ పాలనకు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లి చూసుకుందాం అన్నారు. ప్రజలేం తీర్పు ఇస్తారో చూద్దాం కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు మాట్లాడొద్దు అని ఎంపీ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు.