వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలి నుంచి అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె పోలీస్స్టేషన్లో దాదాపు 9 గంటల పాటు పోలీసులు పోసానిని విచారించారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు రైల్వేకోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం 5 గంటల వరకు కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పోసానికి బెయిల్ ఇవ్వాలని కోరగా.. న్యాయమూర్తి నిరాకరించారు. అనంతరం 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి పోసాని చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని పేర్కొన్నారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంలో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆయనకు ఖైదీ నంబర్ 2261ని జైలు అధికారులు కేటాయించారు.