అంతర్జాతీయ మహిళా దినోత్సవం(Women’s Day) సందర్భంగా మహిళలకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేశారు.
‘తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు నా శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ కాదు. ఇది సమాజ బాధ్యత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోంది. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది అని బలంగా నమ్మి పనిచేస్తున్నాం. మీ భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ… మరొక్క మారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.” అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘అన్నగా పిలిచే…తమ్ముడిగా తలచే…ప్రతి ఆడబిడ్డ సంతోషం కోసం…ప్రతి ఉదయం ఒక సంకల్పం… ప్రతి నిత్యం నా ప్రయత్నం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కుటుంబాలకే కాదు, ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నెముక వంటి వారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఆమె గొప్పదనాన్ని గుర్తిద్దాం… ఆమెకు మద్దతుగా నిలబడదాం, ఆమె కలలకు చేయూతనిద్దాం… మన చర్యల ద్వారా ఆమెకు నిజమైన గౌరవాన్ని అందిద్దాం అని పిలుపునిచ్చారు. మరింత మెరుగైన ప్రపంచాన్ని మనకు అందిస్తున్నందుకు మహిళను గౌరవిద్దాం… మరింత ఎత్తుకు తీసుకెళదాం… ఇవాళ ఒక్కరోజే కాదు… ప్రతి రోజూ అంటూ పేర్కొన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడి ఉందన్నారు. ఆ నానుడిని నమ్ముతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పాలన చేశామని పేర్కొన్నారు.