ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన క్రమంలో వన్డే ర్యాంకులను(ICC Rankings) ఐసీసీ ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో భారత్ ఆటగాళ్లు అదరగొట్టారు. వన్డే బ్యాటింగ్ జాబితాలో శుభ్మన్ గిల్ 784 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ 770 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 756 పాయింట్లతో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని టాప్-3లోకి వచ్చాడు. సౌతాఫ్రికా ఆటగాడు క్లాసెన్ 744 పాయింట్లతో నాలుగో స్థానంలో.. కింగ్ విరాట్ కోహ్లీ 736 పాయింట్లతో ఐదో స్థానంలో.. శ్రేయాస్ అయ్యర్ 8వ స్థానంలో కొనసాగుతున్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ 680 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 657 పాయింట్లతో ఏకంగా ఆరు స్థానాలను మెరుగుపర్చుకుని సెకండ్ ప్లేస్లోకి దూసుకొచ్చాడు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ 650 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకులో నిలిచాడు. కేశవ్ మహారాజ్ 648 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా 616 పాయింట్లతో మూడు స్థానాలను మెరుగుపర్చుకుని పదో ర్యాంక్ సాధించాడు. ఇక వన్డే ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్ -10లో చోటు దక్కించుకున్నాడు.