దివంగత నటి సౌందర్య(Soundarya) 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే సౌందర్య మరణం వెనక నటుడు మోహన్ బాబు(Mohanbabu) ఉన్నాడని ఖమ్మం జిల్లా రూరల్ మండలానికి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి ఆరోపణలు చేశారు. ఇది కేవలం ప్రమాదంగా కాకుండా ఓ కుట్రగా పరిగణించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. జల్పల్లిలోని ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ సౌందర్య, ఆమె సోదరులదని ఆరోపించారు. సౌందర్య మరణం తర్వాత మోహన్ బాబు ఆ ఆస్తిని అక్రమంగా అనుభవిస్తున్నారని.. ఆ స్థలాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఆరోపణలపై సౌందర్య భర్త రఘు(Raghu) స్పందించారు. కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రాపర్టీకి సంబంధించి ఆధారాలు లేని వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సౌందర్యకు చెందిన ఎలాంటి ఆస్తిని మోహన్ బాబు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి ఆస్తి లావాదేవీలు కూడా లేవన్నారు. సౌందర్య మరణించిన తర్వాత కూడా తనకు మోహన్ బాబుతో మంచి స్నేహం ఉందన్నారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు నమ్మకండని విజ్ఞప్తి చేశారు.