తెలంగాణ అసెంబ్లీ(TG Assembly)లో అధికార, విపక్ష సభ్యల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. గవర్నర్ ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని.. ప్రసంగం సమయంలో గవర్నర్ మనసు ఎంత బాధపడిందోనని తెలిపారు. రైతుల గురించి సభలో మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినానాదాలు చేయడంతో జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రన్నింగ్ కామెంట్రీ ఆపి మూసుకుని కూర్చోవాలని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ సభ్యులు అసహనానికి గురికావొద్దని సభా సంప్రదాయాలను పాటించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచించారు. అయితే స్పీకర్ వ్యాఖ్యల పట్ల జగదీశ్ రెడ్డి తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అందరికీ సమాన అవకాశాలున్నాయని.. కాకపోతే సభ్యుల తరపున పెద్ద మనిషిగా ఆ స్థానంలో కూర్చున్నారని తెలిపారు. అంతేతప్ప సభ స్పీకర్ సొంతం కాదని వ్యాఖ్యానించారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం తలెత్తడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.