వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే.. వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను అపహరించి.. బెదిరించిన కేసులో ఈ నెల 28వ తేదీ వరకు వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనికి తోడుగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కబ్జా కేసులో ఏప్రిల్ 1వ తేదీ వరకు గన్నవరం కోర్ట్ రిమాండ్ విధించింది.
కబ్జా కేసులో వల్లభనేని వంశీపై నమోదైన కేసులో కోర్టు పీటీ వారెంట్కు అనుమతి ఇవ్వటంతో గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరిచారు పోలీసులు.. విజయవాడ సబ్జైలులో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుని.. గన్నవరం తరలించిన ఆత్మకూరు పోలీసులు.. గన్నవరం కోర్టులో వల్లభనేని వంశీ మోహన్ను హాజరుపరిచారు. ఈ భూ కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు.
అనంతరం తిరిగి విజయవాడ సబ్ జైలుకు వంశీని తరలించారు పోలీసులు.. ఇప్పటికే సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీకి.. తాజా రిమాండ్తో బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. దీంతో రిమాండ్లో ఉండగానే మరో రిమాండ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.