బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (Chennamaneni Ramesh)కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. రమేశ్ భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరుడు అని తేల్చి చెప్పింది. తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
అంతేకాకుండా రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని చెన్నమనేని రమేశ్ను ఆదేశించింది. రూ. 30లక్షల్లో పిటిషనర్ ఆది శ్రీనివాస్కు రూ.25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీతో కోర్టు తీర్పుపై అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకున్న చెన్నమనేని రూ.30 లక్షలు చెల్లించారు. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ సమక్షంలో ఆది శ్రీనివాస్కు రూ.25 లక్షల డీడీని రమేశ్ తరపు న్యాయవాది అందజేశారు.
కాగా ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ తరపున చెన్నమనేని పోటీ చేసి గెలిచారు. అయితే ఆయనకు భారత పౌరసత్వం లేదని.. ఆయన ఎన్నిక చెల్లదని విపక్ష నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కేంద్రం ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది.