వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానం(Zakia Khanam) బీజేపీలో చేరారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి (Purandeswari) ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. జకియా ఖానం బీజేపీలో చేరడం సంతోషమన్నారు.
కాగా అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జాకియా ఖానమ్ను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. అయితే కొంతకాలంగా పార్టీ నాయకత్వంతో అసంతృప్తిగా ఉంటున్న ఆమె తాజాగా రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల్లో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకట రమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ ఉన్నారు. తాజాగా జకియా ఖానమ్ రాజీనామాతో మండలిలో వైసీపీ బలం రోజురోజుకు తగ్గిపోతుంది.