పాతబస్తీలోని గుల్జార్హౌజ్ చౌరస్తా సమీపంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై(Gulzar House Fire accident)సమగ్ర విచారణకు ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్లు సభ్యులుగా ఉన్నారు. అగ్నిప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి తుది నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలు ఇవ్వాలని సూచించింది. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది.