హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. ఛత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలోని బోయగూడలో ఉన్న రెండంతస్తుల భవనంలో మంటలు అంటుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో భవనంలో ఉన్న వారితో పాటు చుట్టుపక్కల ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన భవనంలో చెప్పుల గోదాము నడుపుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా రెండు రోజుల క్రితం గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వరుస అగ్ని ప్రమాదాలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.