అమెరికా ప్రభుత్వం వలస నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. తాజాగా తమ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై కీలక హెచ్చరిక జారీ చేసింది. తరగతులకు హాజరుకాకపోయినా.. కోర్సులు మధ్యలో వదిలేసిన విద్యార్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) మంగళవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అందులో పేర్కొంటూ ‘‘తరగతులకు హాజరు కాకుండా, లేదా విద్యాసంస్థకు ముందుగా తెలియజేయకుండా కోర్సు మానేస్తే, స్టూడెంట్ వీసా రద్దు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాక, భవిష్యత్తులో మళ్లీ అమెరికా వీసా పొందేందుకు అవకాశాలు తగ్గిస్తున్నట్లు హెచ్చరించింది. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థులు తమ వీసా నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఎటువంటి సమస్య ఉన్నా, దాన్ని అధికారికంగా పరిష్కరించుకోవాలని సూచించింది. వీసా రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తే నేరుగా వీసా రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్ అవకాశాలపై కూడా మచ్చ పడే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
ఇప్పటికే ట్రంప్ హయాంలో ప్రారంభమైన వలస నియంత్రణ విధానాలకు కొనసాగింపుగా, ఈ చర్యలు మరింత కఠినంగా మారుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ హెచ్చరిక భారత విద్యార్థులకే కాకుండా, అమెరికాలో ఉన్న అన్ని విదేశీ విద్యార్థులకు వర్తిస్తుంది. అంతిమంగా చెప్పాలంటే, అమెరికాలో విద్యను అభ్యసించాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే.