Meghalaya honeymoon murder case: షిల్లాంగ్ అందాల్లో అదృశ్యమైన ఓ జంట, ఆ తర్వాత భర్త మృతదేహం లభ్యం కావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిస్సింగ్ కేసు ఇప్పుడు ఓ షాకింగ్ ట్విస్ట్తో ముగిసింది. మేఘాలయ పోలీసులు కేవలం ఏడు రోజుల్లోనే ఈ కేసును ఛేదించి, అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన సత్యాన్ని వెల్లడించారు. ఈ దారుణానికి సూత్రధారి మరెవరో కాదు, ఆ భర్త భార్యే!
ఏం జరిగింది?
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనమ్తో మే 11న వివాహం జరిగింది. నవ దంపతులు మే 20న హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్కు వెళ్లారు. మే 25వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్న వీరిద్దరూ, ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబంలో ఆందోళన మొదలైంది. తమ పిల్లల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మృతదేహం లభ్యం, భార్య ఆచూకీ గల్లంతు
అదృశ్యమైన 11 రోజుల తర్వాత, రఘువంశీ మృతదేహం సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో లభ్యమైంది. అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, భార్య సోనమ్ ఆచూకీ దొరకకపోవడంతో ఆమెను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అనుమానించారు. కేసు మిస్టరీగా మారడంతో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరారు.
మిస్టరీ వీడింది.. భార్యే హంతకురాలిగా గుర్తింపు!
తాజాగా, ఈ కేసు మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసుల ముందు లొంగిపోయింది. భర్త రఘువంశీని హత్య చేసిన ముగ్గురు కిరాయి హంతకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మేఘాలయ డీజీపీ ఐ నోంగ్రాంగ్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, సోనమ్ స్వయంగా తన భర్తను హత్య చేయడానికి కిరాయి హంతకులను నియమించుకుందని నిందితులు పోలీసులకు తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ముఖ్యమంత్రి అభినందనలు…
కేవలం 7 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన మేఘాలయ పోలీసులను ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా అభినందించారు. “దేశాన్ని, రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ కేసును మేఘాలయ పోలీసులు కేవలం 7 రోజుల్లోనే ఛేదించారు. ఈ దారుణానికి కారణమైన మహిళ పోలీసులకు లొంగిపోయింది. మరో నిందితుడిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగ గాలింపు చర్యలు సాగుతున్నాయి” అని సీఎం తెలిపారు.
ఇది కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదు, మానవీయ సంబంధాల్లో నమ్మకద్రోహానికి, దారుణమైన నేరానికి అద్దం పడుతోంది. షిల్లాంగ్ అందాలను ఆస్వాదించాల్సిన హనీమూన్ విషాదాంతమై, నవ దంపతుల్లో ఒకరు హంతకురాలిగా, మరొకరు నిస్సహాయ బాధితుడిగా మారిన ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.