ఏపీ రాజధాని అమరావతి(Amaravati) వేశ్యలకు అడ్డాగా మారిందని సాక్షి టీవీ ఛానల్ డిబేట్ లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలోని దళిత మహిళలను అవమానించారంటూ కృష్ణంరాజుతో పాటు యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి యాజమాన్యంపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో రైతులు.. మహిళలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో ఉంటున్న కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivasa Rao)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. అలాగే విజయవాడలోని అయోధ్య నగర్ లో ఉంటున్న జర్నలిస్ట్ కృష్ణంరాజును అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లగా.. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కాగా సీఎం చంద్రబాబు అమరావతి దేవతల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలపై సాక్షి టీవీ ఛానల్ డిబేట్ లో చర్చ పెట్టారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ అమరావతి వేశ్యల రాజధాని అని.. చుట్టూ పక్కల ప్రాంతాల్లో వ్యభిచారం ఎక్కువగా జరుగుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనిత, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడతో పాటు ఇతర ప్రముఖులు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.
