తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు(Prabhakar Rao) సిట్ విచారణకు హాజరయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు
ఈ కేసు నమోదుకాగానే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి తిరిగి రాకపోవడంతో పాస్ పోర్టు రద్దు చేయించారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే అరెస్ట్ చేయవద్దని పోలీసులకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 14 నెలల తర్వాత అమెరికా నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రాజకీయ, సినీ, ప్రముఖులు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అధికారులను ప్రోత్సహించారనే ఆరోపణలు ప్రభాకర్ రావు ఎదుర్కొంటున్నారు. ఆయన సిట్ విచారణలో నోరు తెలిస్తే ఎలాంటి సంచలన పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉత్కంఠ నెలకొంది.