తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. బస్ పాస్(Bus pass) ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్పాస్ ధరలను ఏకంగా 20 శాతం పెంచింది. నేటి నుంచి కొత్త బస్ పాస్ ధరలు అమల్లోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రూ.1150 ఉన్న ఆర్డీనరీ బస్ పాస్ ధరను రూ.1400కు.. రూ.1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ ధరను రూ.1600కు పెంచారు. ఇక రూ.1450గా ఉన్న మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర రూ.1800కు పెరిగింది.
బస్ పాస్ చార్జీలు భారీగా పెరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా చిన్న ఉద్యోగులు, దినసరి కూలీలు, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు రోజువారీ ప్రయాణానికి ఈ బస్ పాసులను ఉపయోగిస్తారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరగంతో ఇబ్బందులు పడుతున్నామని.. ఇప్పుడు బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచితే బతుకు బండి ఎలా లాగాలని వాపోతున్నారు. ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇప్పటికే మెట్రో రైలు ఛార్జీలను కూడా అధికారులు పెంచిన సంగతి తెలిసిందే. తొలుత 20 శాతం మేర ధరలు పెంచగా.. ప్రయాణికుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో 10శాతం తగ్గించారు. మెట్రో ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు బస్సులో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కొత్త బస్ పాసులను జారీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న 40 ఆర్టీసీ కేంద్రాల్లో విద్యార్థులు బస్ పాసులను పొందవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అలాగే కొత్త బస్ పాస్ ల కోసం.. www.tgsrtc.telangana.gov.in/bus-pass-services వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తును తీసుకెళ్లి బస్ పాస్ కౌంటర్లలో ఇస్తే రాయితీతో కూడిన స్టూడెంట్ బస్ పాస్ జారీ చేస్తారు.
TGSRTC: ప్రయాణికులకు షాక్.. ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు పెంపు
- Advertisement -