కాళేశ్వరం కమిషన్ (Kaleswaram Commission)ఎదుట మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao)విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం ఆయన హుటాహుటిన ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్(KCR) ఫామ్హౌస్ కు వెళ్లారు. కేసీఆర్తో భేటీ అయి విచారణకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈనెల 11న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.
కాగా కమిషన్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్రావు అన్ని ఆధారాలు కమిషన్కు సమర్పించానని చెప్పారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని చాలాసేపు ప్రశ్నించారని చెప్పారు. దీనిపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఐదారు సమావేశాలు జరిగాయని, కేసీఆరే స్వయంగా మహారాష్ట్ర వెళ్లి సీఎం ఫడ్నవీస్కు చెప్పే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం ఉందని చెప్పారు. ఇంజినీర్ల సూచనల మేరకే వీటి స్థలం మార్పు చేసినట్లు కాళేశ్వరం కమిషన్కు వివరించానని పేర్కొన్నారు. రైతులకు ఎక్కువ నీళ్లు అందించడానికి అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని, సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్తోపాటు తాను ఉన్నట్లు కమిషన్కు చెప్పినట్లు వివరించారు. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టే తుమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డకు మార్చినట్లు వెల్లడించారు.
కాళేశ్వరాన్ని కొంతమంది కూలేశ్వరం అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్హౌజ్లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కెనాల్స్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం సమాహారమని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ డొల్లతనం పూర్తిగా బయటపడిందని.. ఎప్పటికైనా తెలంగాణకు లైఫ్లైన్ కాళేశ్వరమేనని ప్రజలకు స్పష్టమైందని వెల్లడించారు.