లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు అద్భుత విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలిచి తమ కలను నెరవేర్చుకుంది. 1998 ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన ప్రోటీస్ టీమ్.. ఇప్పుడు WTC గదను ఎట్టకేలకు ముద్దాడింది. కెప్టెన్ బవుమా(66) పోరాటపటిమ, ఐడెన్ మార్క్రమ్ (136) సూపర్ సెంచరీతో సఫారీ జట్టు కల ఎట్టకేలకు నెరవేరింది. తొలి ఇన్నింగ్స్ లో తడబడినా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా పోరాడి ఘన విజయం అందుకుంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులు చేసింది. ఇక మొదటి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 138 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు 74 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారు జట్టు 207 పరుగులు చేసింది. దీంతో మొత్తం 281 పరుగుల లీడ్ దక్కింది.
282 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 213/2 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. అనంతరం నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే బవుమా వికెట్ కోల్పోయినా.. మార్క్రమ్ పోరాటంతో సునాయాసంగా మ్యాచ్ గెలిచింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెట్ స్టార్క్ మూడు వికెట్లు, హేజిల్ వుడ్, పాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు.
ఇక ఈ మ్యాచ్ లో శతకంతో చెలరేగిన మార్క్రమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాకుండా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ టోర్నీ ఫైనల్స్ల్లో దక్షిణాఫ్రికా తరుపున శతకం సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్స్లో సెంచరీ చేసిన మూడో బ్యాటర్గానూ నిలిచాడు. అతడి కన్నా ముందు ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఈ ఘనత సాధించారు.