KTR Comments On CM Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ-రేసు కేసుకు(Formula E Case)సంబంధించి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ కార్యాలయానికి గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అంతకుమందు నందినగర్ లోని నివాసంలో మాజీ సీఎం, ఆయన తండ్రి కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. వీరిద్దరు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి విచారణల పేరుతో రాక్షస ఆనందం పొంతున్నారని విమర్శించారు. తమకు చట్టాలు, న్యాయస్థానాలపై నమ్మకం ఉందని.. నిజం నిలకడ మీద తెలుస్తుందని తెలిపారు. మూడు సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు వస్తానన్నారు. కేసీఆర్, హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టారని.. ఇవాళ తనను ఏసీబీ విచారణకు పిలిచారన్నారు. తనను అరెస్ట్ చేసినా చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో గతంలో జైలుకు వెళ్లానని.. ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని పేర్కొన్నారు. ఒకసారి కాదు.. వందసార్లు అయినా జైలుకు వెళ్తా అంటూ ఆయన వెల్లడించారు.
ఫార్ములా ఈ రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామన్నారు. కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలనుకుంటే మీ తరం కాదన్నారు. ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపైనా ఏసీబీ కేసులు ఉన్నాయని.. దమ్ముంటే ఇద్దరం లై డిటెక్టర్ టెస్టు చేయించుకుందామని సవాల్ విసిరారు. ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ ప్రజల తరపున కొట్లాడతామని స్పష్టం చేశారు.
ఇక రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వకుండానే హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు సిద్ధం కావడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.