తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో నేడు సాయంకాలం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
గుజరాత్ రాష్ట్రంలోని తీర ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కీ.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రజలంతా రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.