Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారులపై వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్ మెన్ మదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని చెప్పమన్నారంటూ అధికారులు తనపై దాడి చేశారని ఆరోపించాడు. తాము చెప్పినట్టు రాసి.. సంతకం చేయమని తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈమేరకు లేఖ రాశాడు.
తాజాగా మదన్ రెడ్డి ఆరోపణలపై సిట్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. “సత్యమేవ జయతే. మదన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారు. అధికారులు వేధించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. విచారణలో భాగంగా అధికారులు దాడి చేశారు అనేది పచ్చి అబద్ధం. ఈ కేసులో కుట్ర కోణాన్ని మొత్తం బహిర్గతం చేస్తాం. రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముడుపులు అందాయి. ఈ స్కాంలో వచ్చిన డబ్బులే 2024 సాధారణ ఎన్నికల్లో పంచారు. మదన్ రెడ్డి ఆరోపణలపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరపాలి. దీని వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసింది. తప్పు ఎవరిదైనా చర్యలు తీసుకోవాలి. సిట్ ఎవరి బెదిరింపులకు లొంగదు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం” అని లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి చెవిరెడ్డిపై అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లడానికి బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్లిన చెవిరెడ్డిని భద్రతా సిబ్బంది చెవిరెడ్డిని అడ్డుకున్నారు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, రాజ్ కసిరెడ్డి పీఏ చరణ్, సజ్జల రామకృష్ణా రెడ్డి బంధువు సజ్జల సుధీర్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. నేటితో రిమాండ్ ముగియడంతో నిందితులను కోర్టులో హాజరుపర్చగా జులై 1వ తేదీ వరకు వీరి రిమాండ్ ను న్యాయస్థానం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం.. సిట్ అధికారులు సంచలన ప్రకటన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES