కేంద్ర సాహిత్య అకాడమీ 2025 వ సంవత్సరానికి సంబంధించి యువ పురస్కారం, బాల సాహిత్య పురస్కారాలను విడుదల చేసింది. తెలుగు భాషకు సంబంధించి విశాఖ పట్టణానికి చెందిన ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది. అలాగే గంగిశెట్టి శివకుమార్ రచించిన పుస్తకం కబుర్ల దేవత కు కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించింది.
పురస్కారం పొందిన మై రావణ నవల విశాఖ జిల్లా తీర ప్రాంతంలో చేపలు పట్టే బెస్త వాళ్ళ జీవితాలపై రాసిన కథగా తెలుస్తోంది. ఇందులో మొత్తం నాలుగు భాగాలు ఉండగా.. వాడ బలిజల వెనకబాటు తనము, సాహిసోపేతమైన దుర్భర జీవితంపై ఈ పుస్తకం రాసినట్లు తెలుస్తోంది.
అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర సాహిత్య అకాడమీ బృందం ఈ పురస్కారానికి ఎంపికైన పుస్తకాల పేర్లను, విజేతల వివరాలను ప్రకటించింది. ఈ ఏడాదికి సంబంధించి 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే పురస్కారాలను ప్రకటించగా.. డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారం మాత్రం ప్రకటించలేదు. తెలుగు భాషకు సంబంధించి యువ పురస్కారాలకు జ్యూరీ సభ్యులుగా పెద్దింటి అశోక్ కుమార్, జీఎస్ చలం, కుప్పిలి పద్మ ఉన్నారు.
దక్షిణాది నాలుగు భాషల నుంచి 2025 ఏడాదికి సంబంధించి యువ పురస్కారం అందుకోనున్న రచయితలు – వారి పుస్తకాలు వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు: ప్రసాద్ సూరి – మైరావణ (నవల)
తమిళం: లట్చ్మిహర్ – కూత్తొన్ఱు కూట్టిఱ్ఱు(కథలు)
కన్నడం: ఆర్.దిలీప్కుమార్ – పచ్చెయ జగులి(విమర్శ)
మలయాళం: అఖిల్.పి.ధర్మజన్ – రామ్ కేరాఫ్ ఆనంది(నవల)