మధ్య భారతదేశంలో ఎల్ పీ ఏ బలపడటం వలన ఈ నెల 23 నుంచి తెలంగాణలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు విస్తాయని వెల్లడించింది.
ఎల్లో అలెర్ట్ జారీ చేసిన జిల్లాలు:
నేడు నిజామాబాద్ , ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం వంటి ఉత్తర, తూర్పు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసి.. ఆ మేరకు ఆయా ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాంకిడిలో అత్యధిక వర్షం:
నిన్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో అత్యధికంగా 1.36 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గత రెండు రోజులతో పోలిస్తే నేడు హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించి. మరోవైపు వికారాబాద్, సంగారెడ్డి వంటి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాబోయే రోజుల్లో భారీ వర్షాలు:
రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సాయంకాలం వేళల్లో కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం మాత్రమే ఉండగా.. మరికొన్ని జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశం మొత్తం విస్తరించాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే వారంలో రుతుపవనాల జోరు మరింత పెరగనుందని భారత వాతావరణ కేంద్రం కూడా తెలిపింది.