Rythu Bharosa Amount: వర్షాకాలంలో ఆర్థిక సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం “రైతు భరోసా” (Rythu Bharosa) నిధులను విడుదల చేయడం ఇప్పటికే ప్రారంభింది. తొలుత మూడు ఎకరాల లోపు ఉన్న వారికి నిధులు జమ చేసిన ప్రభుత్వం తాజాగా 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు డబ్బులు వేసింది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,313.53 కోట్లు విడుదల చేసింది. మొత్తం 21.89 లక్షల ఎకరాలు, 6.33 లక్ష రైతులకు ఈ నగదు జమచేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
దీంతో ఇప్పటి వరకూ ప్రభుత్వం రూ. 5.215 కోట్లను 58.08 లక్షల మంది రైతులకు సాయం అందించింది. తొమ్మిది రోజుల్లో మొత్తం రూ. 9,000 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో వరుసగా మూడవ రోజు నిధులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం వేసింది. ప్రభుత్వం ఎకరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఖరీఫ్, యాసంగికి కలిపి మొత్తం రూ. 12,000 రైతులకు అందిస్తోంది. గతంలో ఈ సొమ్ము కేవలం రూ. 10,000గా ఉండేంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా సాయాన్ని పెంచారు. ఇదే సమయంలో సాగుకు అనువైన ప్రతి భూమికి రైతు భరోసా సాయం అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం సాగుతోందని ఆయన తెలిపారు.
గత బీఆర్ఎస్ పాలనలో సకాలంలో రైతు భరోసా నిధులు చెల్లించలేదని కానీ మేము సీజన్ ఆరంభం లోనే నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ విషయంలో తమను ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్కి కానీ ఆ పార్టీ నాయకులకు గానీ లేదని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా కేవలం రైతుల సంక్షేమం కోసమే దాదాపు రూ. 77 వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతు రుణమాఫీ చేసి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు.
పనుల్లో నిమగ్నమైన రైతులు: తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ఊపందుకుంది. రైతులు కేవలం పొలం పనులకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇప్పటికే వర్షాలు జోరందుకోవడంతో పత్తి, వరి, ఇతర పంటలు రైతులు పనులను ప్రారంభించారు. చాలా చోట్ల పత్తి గింజలు నాటారు. సకాలంలో వర్షాలు పడితే మంచి పంట చేతికి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.