Saturday, June 21, 2025
HomeతెలంగాణNita Ambani Donation: బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ. కోటి విరాళం

Nita Ambani Donation: బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ. కోటి విరాళం

Nita Ambani Donation for Balkampet Yellamma Temple: రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ సతీమణి నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఈ అమౌంట్‌ దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు దేవాలయం అధికారులు తెలిపారు. ఇదే సంవత్సరం ఏప్రిల్​ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్​, సోదరి మమతా దలాల్​ ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పటి ఆలయ ఈవో కృష్ణ దేఆలయ విశిష్టతను వారికి వివరించారు. అనంతరం దేవస్థానం అభివృద్ధికి కోసం తమవంతుగా సహకారం అందించాలని ఆయన కోరారు. తాజాగా ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని బ్యాంకులో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయనున్నారు. తద్వారా వచ్చే వడ్డీని నిత్యాన్నదానం కోసం వినియోగిస్తామని ఆలయ ఇన్​ఛార్జ్ ఈవో మహేందర్​ గౌడ్​ తెలిపారు.

ప్రస్తుతం ఆలయం ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం కోసం ముస్తాబవుతోంది. జూలై 1 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ కల్యాణ మహోత్సవంలో రథోత్సవం కూడా నిర్వహించనున్నారు. ఇక కల్యాణ సమయంలో అమ్మవారి కల్యాణాన్ని భక్తులు సులభంగా వీక్షించేలా ఎల్​ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేయనున్నారు.

నీతా అంబానీకి ప్రత్యేక పూజలు నిర్వహించడం అలవాటు. దేశంలోని విశిష్టతను కలిగిన దేవాలయాలను వారి కుటుంబం సందర్శిస్తుంటుంది. అక్కడి ఆలయాల గొప్పతనాన్ని తెలుసుకుని సహాయ సహకారాలు సైతం అందిస్తారు. ఆమెకు భక్తి భావాలన్నా.. నిత్యం పూజల్లో పాల్గొనడం మాములే. రోజు లేచిన దగ్గర నుంచే అంబానీ కుటుంబం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు.

కల్యాణ మహోత్సవ సమయంలో అవసరమైన వాటర్​ ట్యాంకర్లు, శుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులను నిరంతరం మూడు షిఫ్టుల్లో పని చేయించనున్నారు. ఇక వీటితో పాటు నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు, హైమాస్ట్​ లైట్లను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో వాలంటీర్ల కోసం గుర్తింపు కార్డులు, అలాగే దాతలు, ముఖ్యమైన వారికి ప్రత్యేక పాస్​లను అధికారులు అందించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా పూర్తి చేస్తున్నారు.

బోనాలు ఆరంభం: మరోవైపు తెలంగాణలో బోనాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రివ్యూ మీటింగ్‌ చేసింది. ప్రత్యేక నిధులు కేటాయించి బోనాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం కావాలని ఆదేశించింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News