HIV Injection: ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో హెచ్ఐవీ (HIV)ముందు వరుసలో ఉంటుంది. ఒక్పపుడు యావత్ ప్రపంచాన్ని గడగడ వణికించింది. ఈ వ్యాధి సోకి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హెచ్ఐవీ కంటే ఎయిడ్స్ అంటేనే ప్రజలకు బాగా అర్థం అవుతోంది. ‘పులి రాజాకి ఎయిడ్స్ వస్తుందా.. ఎయిడ్స్ కి మందు లేదు నివారణ ఒక్కటే మార్గమనే’ స్లోగన్స్ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వినిపించేవి. ప్రభుత్వాలు ప్రజలకు ఈ నినాదాల ద్వారా ప్రజలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించేవి. దీంతో చాలా వరకు ఈ వ్యాధి కంట్రోల్ లోకి వచ్చింది. అయితే ఇప్పటికీ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్న వారు ఉన్నారు.
ప్రపంచాన్ని వణికించిన ఎయిడ్స్ వ్యాధికి టీకా వచ్చిందనే వార్త బాధితుల్లో సంతోషాన్ని నింపుతోంది. హెచ్ఐవీని సమర్థవంతంగా నిరోధించగల సరికొత్త ఇంజెక్షన్ ను గిలీడ్ సైన్సెస్ అనే సంస్థ కనిపెట్టింది. యెజ్టుగో అనే పేరుతో పిలవబడే ‘ లెనకాపవిర్ ‘ అనే టీకాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. ఈ టీకాను ఏడాదికి రెండు సార్లు తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ హెచ్ఐవీ వ్యాధిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా కూడా అడ్డుకుంటుంది.
ప్రస్తుతం హెచ్ఐవీ నివారణకు మందులు ఉన్నా కానీ రోజూ మాత్రలు వేసుకోవాల్సి రావడం చాలా మందికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఏడాదికి రెండు సార్లు వేయించుకునే యెజ్టుగో టీకా రావడం పెద్ద గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. ఈ ఔషధంపై గిలీడ్ సంస్థ రెండుసార్లు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. అయితే ఇంజెక్షన్ తీసుకున్న ప్రదేశంలో నొప్పి, తలనొప్పి, వికారం వంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అలాగే దీని ధర కూడా ఎక్కువగా ఉండటం చర్చగా మారింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ.24లక్షలకు పైగా ఉంటుంది. దీంతో తక్కువ ఆదాయం ఉన్న దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల ప్రజలకూ దీనిని కొనేందుకు భారంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఇంజెక్షన్ను తక్కువ ధరకు అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమేరకు గిలీడ్ సైన్సెస్ సంస్థ 6 ఫార్మా కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న 120 దేశాల్లో తక్కువ ధరకు దీనిని అమ్మాలని భావిస్తున్నారు.
కాగా ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల కొత్త హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఇంజెక్షన్ రాకతో హెచ్ఐవీ వ్యాధిని అడ్డుకోవడం సులభతరం కానుంది. అయితే ప్రజలకు ధర అందుబాటులో ఉంటే మాత్రమే ఇది సాధ్యం అవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.