Sajjala Ramakrishna Reddy: వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. మహిళలపై సంకరజాతి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అమరావతి దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన వెంటనే హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ కేసులో సజ్జలకు బెయిల్ ఇవ్వకుండా తన వాదనలు కూడా వినాలని శిరీష ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో సజ్జలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం చర్చగా మారింది. FIR ఫైల్ అయిన నేపథ్యంలో సజ్జలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
సాక్షి ఛానల్ డిబేట్ లో అమరావతి మహిళలను ఉద్దేశించి వేశ్యల రాజధాని అంటూ సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను అరెస్ట్ చేయాలని.. సాక్షి యాజమాన్యమైన మాజీ సీఎం, భారతి క్షమాపణలు చెప్పాలంటూ కొందరు మహిళలు నిరసనకు దిగారు. అయితే మహిళల ఆందోళనపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పిశాచాలు కూడా ఇలా చేయలేకపోవచ్చని.. వారిని రాక్షసులుగా కూడా పిలవలేమని తీవ్ర విమర్శలు చేశారు. వీరంతా కలసి ఒక రకమైన సంకర తెగలా తయారయ్యారని వ్యాఖ్యానించారు. ఈ తెగ పూనుకుంటేనే ఇలాంటి చర్యలకు పాల్పడగలదని.. పూర్తిగా సమన్వయంతో వ్యవస్థీకృతంగా నిరసనలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇప్పటికే సజ్జల వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు డీజీపీకి లేఖ కూడా రాశారు.
Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES