Kishan Reddy Criticized Congress: సొంత ప్రయోజనాల కోసం జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాన్ని.. ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూను తీరును కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. నెహ్రూకు దూరదృష్టి లేకపోవడం వల్లనే ఆ రాష్ట్రాన్ని “తాకట్టు” పెట్టారని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్పై తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయని అప్పట్లోనే భారతీయ జనసంఘ్ అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హెచ్చరించినా నెహ్రూ పట్టించుకోలేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం శ్యామ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలకు వెళ్లాలంటే వీసా ఎంత అవసరమో.. ఆనాడు జమ్మూ కాశ్మీర్ వెళ్లాలంటే కూడా ప్రత్యేకమైన అనుమతి సిస్టమ్ తీసుకువచ్చారని గుర్తుచేశారు. దీనిని వ్యతిరేకిస్తూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనుమతి లేకుండా జమ్మూ కాశ్మీర్లో అడుగు పెట్టారని తెలిపారు. దీని కారణంగా అరెస్ట్ అయిన తర్వాత ఆయన అనుమానాస్పదంగా మరణించారని వివరించారు.
తాను ఏ లక్ష్యం కొరకైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రాణాలు అర్పించారో ప్రధాని మోదీ 371 ఆర్టికల్ని తొలగించి ఆయన ఆశయాన్ని నెరవేర్చారని పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ 371 వల్ల 42 వేల మంది చావుకు నెహ్రూ కారణమయ్యారని ఆయన దుయ్యబట్టారు. ఇంత మంది చనిపోయినా కాంగ్రెస్ కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల హక్కులను కాంగ్రెస్ పూర్తిగా హరించిందని ఆయన విమర్శించలు గుప్పించారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్కు కీలుబొమ్మలా ఉంటూ.. ఆ దేశాని అనుకూలంగా వ్యవహరించిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ స్వార్థపూరిత రాజకీయం చుట్టే సాగిందని అన్నారు. కులం, మతం పేరుతో సైతం దేశాన్ని కాంగ్రెస్ విభజించిందని ఆయన మండిపడ్డారు. ఇక ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. దీంతో పాటు పత్రికా స్వేచ్ఛను హరించి, పౌర హక్కులకు భంగం కలిగించారని కిషన్ రెడ్డి వివరించారు.
తాజా సర్వే ప్రకారం దేశంలో 14 కోట్ల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. మన అందరికి ఆదర్శం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించారు.