Deputy CM Bhatti Vikramaraka on Rythu Bharosa: రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా పథకం చరిత్రలోనే అద్భుతమైన మైలురాయిని చేరుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రైతుల ఖాతాల్లో కేవలం 9 రోజుల్లోనే రూ. 9,000 కోట్లకు పైగా నిధులను జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందని అభివర్ణించారు. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రజా ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులు జూన్ 16 నుంచి జూన్ 24 మధ్య కాలంలో విడతల వారీగా జమ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల ఎకరాలకు చెందిన రైతులకు ఈ పథకం ప్రయోజనం చేకూరిందని చెప్పారు
ఇక గత ప్రభుత్వం ఎకరానికి కేవలం రూ. 10,000 మాత్రమే చెల్లించిందని కానీ తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఎకరానికి రూ. 12,000 చొప్పున రైతు భరోసా సొమ్ము అందించినట్లు ఆయన పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతే కాకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని వివరించారు.
కేవలం రైతుల సంక్షేమమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, సన్న రేషన్ బియ్యం, వడ్లపై బోనస్ వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతుల కోసం రూ. 2 లక్షల రుణమాఫీ చేసి చరిత్ర తిరగరాసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఇతర మంత్రులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.