Phanindra Narsetti: అనంతిక సనిల్కుమార్ ప్రధాన పాత్రలో, రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి కీలక పాత్రల్లో తెరకెక్కిన ‘8 వసంతాలు’ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్కు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి, నిర్మాతలు హాజరు కాకపోవటం చర్చనీయాంశమైంది. ఇదే క్రమంలో ఓ విలేఖరి ‘‘సినిమాలో హీరో కులం చెప్పలేదు..హీరోయిన్ కులం చెప్పలేదు. కానీ ఓ రేప్ చేసే క్యారెక్టర్ను చూపించాల్సి వస్తే మాత్రం మీకు బ్రాహ్మణుడు కావాల్సి వచ్చిందా? కాశీలాంటి పవిత్ర క్షేత్రంలో ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి కబేళా కావాల్సి వచ్చిందా? ఒక బ్రాహ్మణుడు, ముస్లింలు కలిసి రేప్ చేసేలా సీన్ తీయాల్సి వచ్చిందా?’’ అని అడిగిన ప్రశ్న తెగ వైరల్ అయ్యింది. ఈ ప్రశ్నకు దర్శకుడు ఫణీంద్ర తన సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.
బ్రాహ్మణ వర్గం పట్ల తనకు ఎప్పుడూ అమితమైన గౌరవం ఉందని స్పష్టం చేసిన దర్శకుడు ఫణీంద్ర ‘‘సనాతన ధర్మానికి, వేదాధ్యాయనానికి వారు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు. వారి నాలుకపై సరస్వతి కొలువై ఉంటుందని అంటారుష అన్నారు. అయితే, ఒక వర్గంపైనే ముద్రవేస్తూ అత్యాచారం గురించి విలేకరుల సమావేశంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తనకు అర్థం కాలేదని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నేరాలు చేసేవాళ్లు వారి విచక్షణా స్వభావం కారణంగానే చేస్తారు తప్ప, వారి కులం, మతం ఆధారంగా కాదని ఫణీంద్ర పేర్కొన్నారు. సమాజంలో ప్రజలు సామాజిక హోదాకు భిన్నంగా ఉంటారని చూపించే ప్రయత్నం చేశానని, కేవలం ఒక వర్గాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయలేదని ఆయన వివరించారు. ‘‘కబేళా అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడైనా ఉండొచ్చు. అందుకు తగినట్లుగానే పాత్రలను ఎంపిక చేసుకున్నాను’’ అని ఫణీంద్ర తెలిపారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/producer-dilraju-open-comments-on-game-changer-flop/
కులాన్ని ఈ విషయంలోకి తీసుకురావాలనుకుంటే, ఒక ప్రశ్న అడుగుతానంటూ ఫణీంద్ర రావణుడి ఉదాహరణను తెరపైకి తెచ్చారు. ‘‘రావణుడు ఎవరు? ఆయన ఒక బ్రాహ్మణుడి కుమారుడు. గొప్ప శివభక్తుడు. నుదుటిపై విభూతి ధారణ చేస్తాడు. మెడలో రుద్రాక్షలు వేస్తాడు. మరి ఆయనలో మారింది ఏంటి? ఉన్నత వర్గం నుంచి వచ్చి వేదాలు, పురాణ గ్రంథాలను ఔపోసన పట్టి చివరకు ఏం చేశాడు?’’ అని ప్రశ్నించారు ఫణీంద్ర. దీని ద్వారా, నేర స్వభావానికి మనిషి ప్రవర్తన, ఆలోచనా ధోరణి కారణం అవుతాయని, మతం, కులం కాదని ఫణీంద్ర నొక్కి చెప్పారు. ‘‘అది మానవ నైజం. యద్భావం తద్భవతి. మీరు ఏం చూస్తారో అదే కనపడుతుంది. మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి. దయ చేసి అనవసర విషయాలను ఇందులో కలపకండి’’ అంటూ ఆయన విలేకరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వేదికపై పంతులు అనే పదాన్ని పలకటంపై స్పందిస్తూ “ఆ పదం వాడకపోయి ఉంటే బాగుండేది. కానీ, ఒక్క మాటను మీరు మార్చాలనుకోవటం తప్పు కాదు. దాన్ని అక్కడితో వదిలేసి ఉంటే బావుండేది” అని డైరెక్టర్ ఫణీంద్ర పేర్కొన్నారు.