India Defence stocks rise: ఇప్పుడు యుద్ధాల కాలం నడుస్తోంది. దీనికి అనుగుణంగా ప్రపంచ దేశాలు రక్షణ రంగంపై దృష్టి పెడుతున్నాయి. అంతేకాదు ఇటీవలి కాలంలో భారత రక్షణ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, స్థానిక తయారీ సంస్థలకు ప్రోత్సాహం వంటి అంశాల వల్ల ఈ రంగం తిరుగులేని అవకాశాలను అందిస్తోంది. ఇటీవలి రోజుల్లో భారత స్టాక్ మార్కెట్లో రక్షణ రంగానికి చెందిన షేర్లు బలంగా ర్యాలీ చేస్తున్నాయి. డిఫెన్స్ స్టాక్స్ స్టాక్ మార్కెట్లో వేగంగా పెరుగుతున్నాయి.
ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయంగా రక్షణ వ్యయాలపై దేశాలు మరింత దృష్టి పెట్టాయి. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చే అవకాశాలు, హార్ముజ్ జలమార్గం మూసివేసే ప్రమాదం వంటి అంశాలు మార్కెట్లను ఆందోళనకు గురిచేశాయి. అయితే ఈ సంక్షోభం భారత రక్షణ రంగానికి లాభంగా మారింది. నాటో దేశాలు తమ జిడిపిలో రక్షణ వ్యయాన్ని 5% వరకు పెంచాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారతీయ రక్షణ కంపెనీలకు విదేశీ కంపెనీలు భాగస్వాములుగా మారే అవకాశం ఏర్పడింది.
ఈ పరిణామాల మధ్య జెన్ టెక్నాలజీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, పారాస్ డిఫెన్స్, డేటా ప్యాటర్న్స్, అపోలో మైక్రో సిస్టమ్స్ వంటి షేర్లు మార్కెట్లో వేగంగా పెరుగుతున్నాయి.
జెన్ టెక్నాలజీస్ షేరు 4.99% పెరిగింది. కంపెనీ టీసా ఏరోస్పేస్ అనే యుఎవి, లోయిటరింగ్ మ్యూనిషన్స్ రంగంలో నిపుణత కలిగిన సంస్థలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇది టెక్నాలజీ విస్తరణకు నిదర్శనంగా చెప్పవచ్చు.
పారాస్ డిఫెన్స్ 4.41%, భారత్ ఎలక్ట్రానిక్స్ 2.44%, డేటా ప్యాటర్న్స్ 1.94%, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 1.02% వృద్ధిని నమోదు చేశాయి.
షిప్బిల్డింగ్ రంగంలో మజగాన్ డాక్, కొచ్చిన్ షిప్యార్డ్, గార్డెన్ రీచ్ వంటి కంపెనీలు కూడా లాభపడ్డాయి.
2025–26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు కేటాయించింది. ఇది మొత్తం ఖర్చులో 13 శాతం ఉంది. క్యాపిటల్ అవుట్లేలో 13 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. దీనిలో అధునాతన ఆయుధాలు, నౌకలు, విమానాలు, రీసెర్చ్ & డెవలప్మెంట్కు భారీగా నిధులు కేటాయించబడ్డాయి. దీని ఫలితంగా స్వదేశీ తయారీకి గట్టి ఊతం లభిస్తోంది.
ప్రముఖ మార్కెట్ నిపుణులు.. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (HAL), భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) అనేవి ప్రతి ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో తప్పకుండా ఉండాలని పేర్కొంటున్నారు.
భారత రక్షణ రంగం ప్రస్తుతం పరిణామ దశలో ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ ప్రోత్సాహం, “మేక్ ఇన్ ఇండియా” విధానం, భారీ బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లోని రక్షణ రంగ షేర్ల పెరుగుదలకు కారణం కానున్నాయి.