Citizens Issue Challans: ప్రస్తుతం రోడ్లపై వేల సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి కారణం చాలా మంది రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించడమే. రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లే ఇందుకు కారణం. హైస్పీడ్, మద్యం మత్తులో లేదా నిద్రలో ఉండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిన్నింటికంటే ముఖ్యంగా రోడ్డు సేఫ్టీని ఎవ్వరూ పాటించడం లేదు. ఇది ట్రాఫిక్ పోలీసులకు సైతం తలనొప్పిగా మారుతోంది. అయితే ఇప్పటికే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో పాటు పౌరులు సైతం తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో చేరేలా దిల్లీ పోలీసులు ఆహ్వానిస్తున్నారు. ఇలా చేసిన వారికి నెలకు రూ.50,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది.
చలానా ఎలా జారీ చేయాలి?: ఇందులో చేరిన వారికి ముందుగా ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పిస్తారు. దీంతో నేరుగా పోలీసు యాప్లో కంప్లైట్స్ రిజిస్టర్ చేయవచ్చు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం పౌరుల నుంచి రోజుకు 1,400 నుంచి 1,500 వరకు ట్రాఫిక్ చలాన్లు వస్తున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి వివరించారు.
ప్రక్రియ: ఇందుకోసం పౌరులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ప్రహరి’ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అధికారికంగా ట్రాఫిక్ నిబంధనలను ఎవరైనాఉల్లంఘిస్తే స్పష్టమైన ఫోటోతో కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. సమయం, లొకేషన్ వివరాలతో సహా యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ వివరాలన్నీ మీరు సమర్పించిన తర్వాత దిల్లీ ట్రాఫిక్ పోలీసులు వాటిని నిర్ధారించిన తర్వాత అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాత సదరు వాహన దారుడికి చలానా జారీ చేస్తారు.
రివార్డులు: ఈ యాప్ ద్వారా కంప్లైట్స్ రిజిస్టర్ చేసిన టాప్ కంట్రిబ్యూటర్లకు నెలవారీ నగదు బహుమతులు అందజేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. మొదటిస్థానంలో నిలిచిన వ్యక్తికి రూ.50వేలు, రెండోస్థానానికి రూ.25వేలు, మూడోస్థానంలో నిలిచిన వారికి రూ.15వేలు, నాలుగో స్థానంలోని వారికి రూ.10 వేల నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు.
ఈ విధానం ఓ గేమ్ ఛేంజర్గా మారిందని అధికారులు పేర్కొన్నారు. ఇందులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రివార్డులను సొంతం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. రివార్డులతో పాటు బాధ్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుతున్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడంలో వారి పాత్ర కీలకంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.