Sunday, October 6, 2024
HomeతెలంగాణKCR: సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుదాం

KCR: సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుదాం

తెల్లాపూర్ హెచ్ఎండీఏ నర్సరీలో పెంచిన 3 ఏళ్ల వయస్సున్న 7.5 అడుగుల ‘పొన్న’ మొక్క నాటిన సీఎం కేసీఆర్

సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోకాపేట్ లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) లే అవుట్ నియోపోలీస్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ అందించిన మొక్కను సిఎం గారు నాటారు. తెల్లాపూర్ హెచ్ఎండీఏ నర్సరీలో పెంచిన మూడేళ్ల వయస్సు కలిగిన 7.5 అడుగుల ‘పొన్న’ మొక్కను నాటి వర్మికంపోస్ట్ ఎరువు వేసి సీఎం నీరు పోశారు.

- Advertisement -

పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పంచభూతాల్లో భాగమైన నీరు, ప్రాణవాయువును కొనుక్కొనే దుస్థితికి మానవాళి చేరడానికి మానవ తప్పిదాలే కారణమని సీఎం స్పష్టం చేశారు. ప్రకృతిని మనం కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సత్యాన్ని మరవరాదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేడు రాష్ట్రంలో పచ్చదనం పెరిగి జీవ వైవిధ్యం పరిఢవిల్లుతున్నదని సీఎం అన్నారు. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.70 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెల్లిడంచడం గొప్ప విషయమన్నారు. ఇది తెలంగాణ ప్రజల పర్యావరణ పరిరక్షణ దీక్షకు దర్పణం పడుతున్నదన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవడం, బృహత్ ప్రకృతి వనాల పై నీతి ఆయోగ్ ప్రశంసలు, హరితహారం ద్వారా 273 కోట్ల మొక్కలను నాటడం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నంగా రికార్డులకెక్కడం, ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ నివేదికలో పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కడం వంటి విజయాలన్నీ పర్యావరణ పరిక్షణ పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయని సీఎం అన్నారు. పర్యావరణహిత రాష్ట్రాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపి కే కేశవరావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, హెచ్ ఎమ్ డీ ఎ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News