Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Mallapur: కోరుట్ల 'హస్త'గతమయ్యేనా ?

Mallapur: కోరుట్ల ‘హస్త’గతమయ్యేనా ?

సర్వేలు చెబుతున్నదానిపై సీరియస్ డిస్కషన్స్

కోరుట్ల నియోజకవర్గంలో గ్రామాల్లో కాంగ్రెస్ జోరు కనిపిస్తుంది. స్థానికంగా ఎటుచూసినా పల్లెల్లో కాంగ్రెస్ పార్టీపట్ల గ్రామస్థులు ఆకర్షితులైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లో గడపగడపకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. అధికార పార్టీని కాదని ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లుతున్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నరసింగరావుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడం, రెండు సార్లు ఓడిపోవడం ద్వారా మూడవసారి పోటీలో ఉండటం వల్ల నర్సింగరావుపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలు ఇక్కడి అన్ని వర్గాల ప్రజల్లో కొత్త చైతన్యం తెస్తుండటం విశేషం. అధికారంలోకి రాగానే చక్కెర కర్మాగారం ప్రారంభిస్తాం అనడం కాంగ్రెస్ కు కలిసి వచ్చే సానుకూల అస్త్రంగా మారింది. వెరసి.. ఈసారి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగానే నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్ క్రమేణా పుంజుకుంది, ఎన్నికలు సమీపించేకొద్దీ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం వస్తోందన్నమాట.

- Advertisement -

వారందరిదీ ఒకే మాట !
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు నేతలు టికెట్ పోటీలో ఉండగా చివరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జువ్వాడి నర్సింగ రావుకే టికెట్ కేటాయించింది. టికెట్ రాకపోగా అసంతృప్తిగా ఉన్న కొమిరెడ్డి కరం, కల్వకుంట్ల సుజిత్ రావు, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డిలతో అధిష్టాన పెద్దలు మాట్లాడి.. అందరినీ ఒకతాటి పైకి తేవడంతో జువ్వాడికి రాజకీయంగా మరింత కలిసివచ్చేలా చేస్తోంది. రాబోయే రోజుల్లో నలుగురు నేతలు కలిసి ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ లోని ఈ ఐక్యత అధికార బీఆర్ఎస్ కు, ప్రత్యర్థి బీజేపీకి ఏమాత్రం రుచించటంలేదు. ఏదేమైనా కాంగ్రెస్ కు మంచి రోజులొచ్చాయని కాంగ్రెస్ నేతలు అప్పుడే సంబరపడిపోతున్నారు.

ఈ హవా ఓటింగ్ వరకూ కొనసాగేనా ?
నామినేషన్ల ప్రక్రియ ముగిసింది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు రెబల్ గా పోటీ చెయ్యకపోవడం రాజకీయంగా కలిసొచ్చే మరో అంశంగా మారింది. కానీ గులాబీ, కాషాయ అభ్యర్థుల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీని జువ్వాడి ఇలాగే తట్టుకుని నిలబడగలరా అన్నది పజిల్ గా మారింది. ధనబలంతో బీజేపీ, బీఆర్ఎస్ లు పన్నే వ్యూహాన్ని జువ్వాడి ఎదుర్కోగలరా? అంటూ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరోవైపు సర్వేలన్నీ కోరుట్లలో కాంగ్రెస్ గాలి వీస్తోందని తేల్చేసాయి. దీంతో ఇక్కడి కాంగ్రెస్ పార్టీలో నైతికబలం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కోరుట్లలో కాంగ్రెసే గెలుపు గుర్రమంటూ పందేలు కట్టే వారి సంఖ్య ఇక్కడ విపరీతంగా పెరిగిపోవటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News