Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Leader in Democracy: ప్రజా పాలనలో నాయకుడు

Leader in Democracy: ప్రజా పాలనలో నాయకుడు

ఓటు విలువ గుర్తించండి

తెలంగాణ శాసనసభకు ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఖరారు అయ్యారు. అన్ని పార్టీలు తమ జాబితాను వెల్లడించాయి. ఆ మేరకు అభ్యర్థులకు బి ఫారములు ఇచ్చింది. తమ తమ స్థానాల్లో అభ్యర్థులు ప్రచార హోరును పెంచుతున్నారు. కీలక పోరు, ప్రచార హోరు ఊపందుకొని దూసుకుపోతున్నారు. ప్రజా పాలకులంటే? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నికల్లో ఓట్ల ద్వారా ఎన్నుకోగా పాలకులుగా అధికార పీఠాన్ని అధిష్టిస్తారు. పాలకుల్ని ప్రజలు మోస్తున్నా ప్రజలందరినీ వారు మోయాలి. ప్రజల కష్టాలను తొలగించి సంక్షేమ, సమ్మిళిత, సమ సమాజాన్ని నిర్మిస్తూ పాలితుల రక్షణ బాధ్యతలు చేపట్టాలి. కన్న తండ్రి ఎలా బాధ్యతతో ఉంటాడో అలా ఉంటూ ప్రజల ప్రీతి పాత్రుడవ్వాలి. బిడ్డ ఏడుపు విన్న తల్లి ఎలా పరిగెడుతుందో.. అలా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నాయకుడు అలా పరుగెత్తాలి. అలాంటి వారే నిజమైన ప్రజాసేవకులు. లీడర్(నాయకుడు) అంటే? వైబ్రేషన్ దండును ముందుండి నడిపించేవాడు. మంచికై పరితపించడం, ముక్కుసూటితనం నిజమైన నాయకుడి నైజం. జనాన్ని తన వెంట నడిపించుకునే నైపుణ్య శీలి. ఆత్మస్థైర్యాన్ని కొండంత నింపుకొని ప్రజా అనుగ్రహాన్ని పొందుతూ అభద్రతాభావం లేనివాడే నాయకుడు. ఎంత చదువు ఉన్నా మిడిసిపడకుండా వినయంగా ఉండాలి. ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఓర్పు కలిగి ఉండాలి. ఎలాంటి స్వార్థం లేకుండా మంచి పనులు చేయాలి. ప్రజాపాలనంటే.. కల్లబొల్లి మాటలు చెప్పడం కాదు, పారదర్శకమైన ఆచరణే ఆ నాయకున్ని రక్షిస్తుంది. లేకుంటే ఎంతటి నాయకుడైనా ఓటర్ల మన్నన పొందనప్పుడు అగాధంలో పడిపోక తప్పదు. ఇదంతా ఆదర్శానికేనా.. ఆ రాత పూతలకేనా! ఈ ప్రశ్న పాతదైనా నేటికి ఎప్పటికి ప్రశ్నలు ప్రశ్నలు గానే మిగిలిపోతున్నాయి. మన రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పార్టీల బి ఫారములతో గుర్తింపు పొంది ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. తుఫాన్ వేగంతో మేనిఫెస్టోలో హామీల జోరు.. ప్రచార హోరును చూస్తున్నారు, భరిస్తున్నారు ప్రజలు. నాయకులు ఏసి బంగ్లాలు, అట్టహాసాలు, ఆర్భాటాలు, వైభోగాలు వదిలిపెట్టి ప్రజల ఇళ్ళ ముందు ఓట్ల కోసమై వాలుచున్నారు. ఎవరి గొప్పలు వారు సభలు, సమావేశాల్లో, ర్యాలీలలో ఊదరగొడుతున్నారు. ప్రత్యర్ధుల బలహీనతలను ఓటరు మహాశయుల చెవులు పగిలేలా ఢంకా బజాయిస్తూ దండోరా వేస్తున్నారు. రాజకీయ పార్టీ(నేత)లు ఈ ఎన్నికల్లో వేస్తున్న ఎత్తులు, జిత్తులన్నీ ప్రజలను ప్రలోభ పెట్టి, అమలు కాని హామీలతో అధికారపక్షం అధికారాన్ని నిలుపుకోవడానికి, ప్రతిపక్షం ఏదోలా అధికారాన్ని చేపట్టడానికి ప్రజలపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నారు. కులం, మతం, వర్గాల వారీగా జనాన్ని ప్రసన్నం చేసుకోవడానికి సకల అవస్థలు పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుంటే? ప్రచార హోరు, విమర్శల జోరు పెంచుకుంటూ అభివృద్ధి మాది అంటే! అవినీతి మీది అని? కాదు మీదేనని ఒకరిపై ఒకరు పార్టీ(నాయకు)లు రాజకీయ బురద చల్లుకుంటున్నారు. కానీ అందరూ వంతుల వారిగా జాతి సంపదను కొల్లగొట్టిన వాళ్లే?. అభివృద్ధి చేశామంటూ చెప్పే నాయకు(పార్టీ)ల చిలుక పలుకులు నేతి బీరలో నెయ్యి చందమే. నిజంగా అభివృద్ధి జరిగింది నాయకులకు మాత్రమే. ప్రజల బ్రతుకులు దుర్భరంగా ఉన్నాయనేది వాస్తవం కాదా!. 75 ఏళ్ల స్వాతంత్ర్య వజ్రోత్సవాలను జరుపుకున్నాం. ఇంకా రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం, స్వేచ్ఛ అందక ప్రజలు పేదరికంలో స్వాతంత్రం నాటి జనాభా కంటే ఎక్కువ ఉన్నారు. నాయకుల చుట్టూ కొందరు స్వార్ధపరులు కోటరీ (గ్రూపు)గా తయారవుతారు. వారి స్వార్థం కోసం అంతా బాగుందనే నమ్మకం కలిగిస్తూ ప్రజా వ్యతిరేకతను అధినేత ఆశీస్సులతో వారి దృష్టికి రాకుండా చూస్తారు. దీనివల్ల ఆ నాయకులకు అపార నష్టం జరిగేంతవరకు తెలుసుకోలేరు. అందుకే వారే స్వయంగా ప్రజా స్థితిగతులను తెలుసుకుంటూ పరిష్కరించాలి. నేడు జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఇలాంటి అవకతవకల వల్ల రాత్రికి రాత్రే పార్టీలు మారడం చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పక్షా(నాయకు)లకు దేశం, రాష్ట్రం మీద గాని ప్రజల మీద గాని ఏ మాత్రమైనా గౌరవభావం, ప్రేమ, భక్తి ఉంటే? ఏరులై పారుతున్న నల్లధనాన్ని, మద్యాన్ని, ఆల్ ఫ్రీ హామీలను నిరోధించేందుకు రాజకీయల్లో విలువల కోసం చేతులు కలపాలి. రాజకీయ పార్టీలన్నీ ధనవంతులనే ప్రజాప్రతినిధులను చేయాలనుకునే దౌర్భాగ్య సంస్కృతికి చరమగీతం పాడాలి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆ దిశగా రాజకీయాల్లో నైతిక విలువలు పెంపొందేలా చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. లేకపోతే ఎన్నికలలో పవిత్రత, విలువలు ప్రజాస్వామ్య పరిరక్షణ అందని ద్రాక్ష గానే మిగిలిపోతున్నాయి. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసే హీన సంస్కృతి క్షమించరాని నేరం. అన్ని పార్టీలు తరతమ భేదాలు లేకుండా యధేచ్చగా ఆ మహా అపరాధానికి ఒడిగడుతున్నాయి. ఇలా కాసుల మూటలతో జనాన్ని ప్రలోభ పెట్టి పార్టీలు దండుకుంటున్న ఓట్లు దేశానికి తీవ్రంగా చేటు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య పాలనలో అధికారం పొందడానికి ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. గెలిచి పదవిలోకి వచ్చాక మాట తప్పి, మడమ తిప్పుచున్నారు. పార్టీ(నాయకు)లు ఓట్లేసిన ప్రజలను అలా నిలువునా ముంచివేస్తున్నాయి. అందుకే గతంలోనే ఎన్నికల సంఘం.. మీరు చేయగలిగేవే చెప్పండి.. ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారు? ఎంత కాలంలో పూర్తి చేస్తారో మేనిఫెస్టోలో స్పష్టంగా వివరించండి అని హితబోధ చేసింది. వారి హితబోధలు పార్టీ (నాయకు)లకు రుచించడం లేదు. ఇలా ఆపద మొక్కులు మొక్కడంలో పార్టీలు పోటీ పడుతున్నాయి. గడువులోగా హామీలను నెరవేర్చని పార్టీలు గద్దె దిగిపోయేలా! మరో ప్రత్యేక చట్టాన్ని అమలులోకి తీసుకురావలసి ఉంది. రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోదకాలిస్తూ, చట్టసభల గౌరవ ప్రతిష్టలకు విఘాతం కలిగిస్తున్న కొద్దీ ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. అంతిమంగా నియంతృత్వం, విద్వేషాలకు దారితీస్తుంది. జనాన్ని నమ్మించి గొంతు కోసే విధ్వంసక రాజకీయాలకు అడ్డుకట్ట పడాలంటే!. మాన్యునికైనా సామాన్యునికైనా సమాన విలువనిచ్చేలా డాక్టర్ అంబేద్కర్ అందించిన “ఓటు” విలువను గుర్తించండి. ప్రజాస్వామ్య సౌధానికి ఓటర్లు పునాదులు. సమాజంలో విలువల రక్షణ కోసం ప్రజలు చైతన్యవంతులై ఉద్యమించకపోతే, ఈ కుళ్ళు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ప్రలోభాలకు లొంగకుండా కుళ్ళు రాజకీయాలు కడిగేసే పథక రచనకు పూనుకోవాల్సింది ముమ్మాటికి ప్రజలే. ఒక్క క్షణం నిర్లక్ష్యం చేయడం వల్ల కోల్పోయిన అవకాశం.. మరో క్షణం నుంచి నీ జీవిత నాశనానికి పునాది అవుతుంది. కాబట్టి ఆలోచించి ఓటు వెయ్యి. అవినీతి రహితమైన విలువలతో కూడిన నిస్వార్ధంగా సేవలు అందించే పాలకులకు పాలనా పగ్గాలు ఇవ్వండి. ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు అందించండి. అమ్ముడుపోకు ఆగం కాకు. మంచి నాయకున్ని ఎన్నుకుంటేనే ప్రజాస్వామ్యం బతికి బట్ట కడుతుంది..

  • మేకిరి దామోదర్, వరంగల్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News