Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Revanth Reddy: ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటా: సీఎం రేవంత్

Revanth Reddy: ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటా: సీఎం రేవంత్

ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది?

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడి మట్టికి గౌరవం, గాలికి పౌరుషం, మనుషుల్లో పోరాట పటిమ ఉందని, చరిత్రలో పౌరుషం గురించి ప్రస్తావించాలంటే రాంజీ గోండు, కొమురం భీమ్ గురించి ప్రస్తావించాల్సిందేనన్నారు సీఎం రేవంత్. ఇంద్రవెల్లి అమరుల స్థూపం సాక్షిగా ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటామని మాట ఇచ్చాం..ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.

- Advertisement -

అందుకే అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతం నుంచే ప్రారంభించామని, ఈ వేదికపై నుంచి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నానన్నారు. మీ పదేళ్ల పాలనలో ఏనాడైనా ఈ అడవి బిడ్డల గురించి, ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల గురించి ఆలోచించారా? ఆ కుటుంబాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఏనాడైనా మంత్రివర్గంలో చర్చించారా? కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంస రాష్ట్రంగా మార్చారు.

మిషన్ భగీరథ పేరుతో 40 లక్షల కోట్లు దోచుకున్నారని, నిజంగా ఈ గూడాలకు మంసీబీ నీళ్లు ఇచ్చి ఉంటే.. ఇప్పుడు రూ.65 కోట్లతో మేం పనులు మొదలు పెట్టాల్సి వచ్చేదా? కేసీఆర్ తన సొంత కుటుంబ సభ్యుల కోసమే తప్ప… ఏనాడు ప్రజల కోసం ఆలోచించలేదు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎన్ని శాపనార్ధాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

త్వరలోనే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని, లక్ష మంది ఆడబిడ్డల మధ్య ప్రియాంక గాంధీని పిలిచి రూ.500 లకే సిలిండర్ అందించే కార్యక్రమం చేపడతామన్నారు సీఎం రేవంత్. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని, పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించుకుందామని, మూడు నెలల్లో ఆరునెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుందని, కేసీఆర్ సీఎం అయితరని కొందరు మాట్లాడుతున్నారన్నారు. ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేదని రేవంత్ గర్జించారు.

ఇదేమైనా మీరు దోపిడీ చేసిన లక్షకోట్ల కాళేశ్వరం కూలినట్లు అనుకున్నారా? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే.. ప్రజలు బోర్లా పడుకోబెట్టి తొక్కుతరు, ఆనాడు ఇంద్రవెల్లి సాక్షిగా సమర శంఖం పూరించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, మళ్లీ ఇదే ఇంద్రవెల్లి సాక్షిగా సమర శంఖం పూరిస్తున్నామన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ పార్లమెంటులో కాంగ్రెస్ గెలవాలన్నారు రేవంత్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News