Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుKothagudem: 11 టన్నుల గంజాయి దగ్ధం

Kothagudem: 11 టన్నుల గంజాయి దగ్ధం

డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో..

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే రోజు దశల వారీగా నిషేధిత గంజాయిని దహనం చేసిన ఘనత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే దక్కిందని జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు ఐపిఎస్‌ అన్నారు. జిల్లాలోని 17 పోలీస్‌ స్టేషన్లలో 142 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్‌ చేసిన 11,061 కేజిల నిషేధిత గంజాయిని హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ 27 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. జిల్లా డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ చైర్మన్‌ రోహిత్‌ రాజు ఐపిఎస్‌, సభ్యులైన ఓఎస్డి సాయి మనోహర్‌, భద్రాచలం ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఐపిఎస్‌, పాల్వంచ డిఎస్పీ వెంకటేష్‌, మణుగూరు డిఎస్పీ రాఘవేందర్రావుల ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిషేధిత గంజాయిని దశల వారీగా విభజించి దహనం చేశారు.

- Advertisement -

డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ చైర్మన్‌ అయిన జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు ఐపిఎస్‌ పోలీస్‌ స్టేషన్ల వారీగా కొన్ని భాగాలుగా విభజించిన గంజాయిని హెడ్‌ క్వార్టర్స్‌ నందు తూకం వేసి పరిశీలించారు. అనంతరం దహనం కొరకు సిద్ధం చేసిన మొత్తం గంజాయిని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తరలించి తగలబెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురిచేస్తూ మత్తులోకి దించుతున్న వారిని అరికట్టడం కోసం జిల్లా పోలీస్‌ శాఖలో రహస్య బృందాల్ని ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వెంకటేష్‌, రాఘవేంద్రరావు డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బి ఇన్స్పెక్టర్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News