Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్YCP: మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటన.. మరో 15 మంది వైసీపీ నేతలు అరెస్ట్

YCP: మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటన.. మరో 15 మంది వైసీపీ నేతలు అరెస్ట్

YCP leaders arrested: పొగాకు రైతులకు మద్దతు ధర ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా పొదిలిలో ఈనెల 11న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అమరావతి మహిళలపై సాక్షి డిబేట్ లో మాట్లాడిన అసభ్యకర వ్యాఖ్యలపై జగన్ క్షమాపణలు చెప్పాలంటూ స్థానిక మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే నిరసన తెలిపిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడి చేయడం కలకం రేపింది. ఈ దాడిలో కొంతమంది మహిళలతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు శుక్రవారం 9 మందిని అరెస్ట్ చేయగా.. తాజాగా మరో 15 మందిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి అనుమతి తీసుకున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ పర్యటనలో నిబంధనలు ఉల్లఘించారని ర్యాలీలో ఉద్రిక్తత పరిస్థితులు ఎదురైన క్రమంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై బూచేపల్లి స్పందిస్తూ తాను ఎక్కడికి పారిపోలేదని.. తన పిల్లలను చూసేందుకు హైదరాబాద్‌ వచ్చానని తెలిపారు. పోలీసులు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి వివరణ ఇస్తానని స్పష్టం చేశారు.

ఇక ఈ ఘటనకు సంబంధించి వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి పొదిలి వెళ్లానని తెలిపారు. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే.. ఆ మార్గంలో 40 మంది టీడీపీ కార్యకర్తలతో రాళ్లు విసిరి గలాటా చేయించారని ఆరోపించారు.

కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారన్నారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. పైగా అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? అని మండిపడ్డారు. రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుందని జగన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News