Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Cyclone: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ

Cyclone: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో..

మీచౌంగ్ తుఫాను నేపథ్యంలో నెల్లూరు నగరంలో దెబ్బతిన్న విద్యుత్ ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరిస్తున్నట్లు తుఫాను జిల్లా ప్రత్యేక అధికారి హరి కిరణ్ పేర్కొన్నారు.

- Advertisement -

మంగళవారం ఉదయం నుండి తుఫానుకు దెబ్బతిన్న ప్రాంతాలను జిల్లా కలెక్టర్ యం హరి నారాయణన్, మున్సిపల్ కమీషనర్ వికాస్ మర్మత్ లతో కలసి పరిశీలించారు.

సోమవారం అర్ధరాత్రి జిల్లాకు చేరిన ప్రత్యేక అధికారి వెనువెంటనే జిల్లా కలెక్టర్ తో కలసి సమావేశమై తుఫాను సన్నద్దత చర్యలను చర్చించారు. మంగళవారం ఉదయం నుండి నెల్లూరు నగరంలోని కెవిఆర్ పెట్రోల్ బంక్, ఆత్మకూరు బస్టాండ్ దగ్గర అండర్ బ్రిడ్జ్, విజయమహల్ గేట్ అండర్ బ్రిడ్జ్, రామ్మూర్తి నగర్ లోని మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సహాయ పునరావాస కేంద్రంను పరిశీలించారు. శిబిరాల్లో తలదాచుకున్న ఇతర రాష్ట్రాల వారితో మాట్లాడారు. ఈ సందర్బంగా శిబిరంలో తలదాచుకున్నవారు మాట్లాడుతూ, నగరంలో పుల్కా బండ్లు, రోళ్లు తయారీ చేస్తూ జీవనోపాధి పొందుతామని, ఓవర్ బ్రిడ్జిల కిందే నివాసముంటామని, మాలాంటి వారిని కూడా గుర్తించి ప్రత్యేక శిబిరంలో చేర్చి భగవంతునిలా ఆదుకుంటున్న ప్రభుత్వానికి తమ ధన్యవాదాలన్నారు. అనంతరం మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జిని పరిశీలించారు. రోడ్లపై నేలకోరిగిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్న సిబ్బందికి తగు సూచనలు అందిస్తూ ముందుకు సాగారు.

అనంతరం నిండుకుండలా ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ ను పరిశీలించి, నీటమునిగిన పంట పొలాలను చూసి రైతులతో మాట్లాడారు. అనంతరం కనుపూరు చెరువును పరిశీలించి, వెంకటాచలం మండలం కులతీగలపాడు గ్రామం వద్ద, అదేవిధంగా సౌత్ మోపూరు వద్ద గండి పడిన కనుపూరు కాలువను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు.

ఈ సందర్బంగా ప్రత్యేక అధికారి హరి కిరణ్ మాట్లాడుతూ జిల్లాలో తుఫాను ముందస్తు చర్యలు పకడ్బందీగా చేపట్టినందువల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. తుఫాన్లు సంభవించినప్పుడు ఏ ఒక్కరి ప్రాణం పోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక్క రాత్రి లోనే తీవ్రంగా నష్టపోయిన నెల్లూరు నగరంను వేగవంతంగా పునరుద్దరణ చర్యలు చేపట్టామన్నారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారికి మంచి భోజన వసతితో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబానికి 2500/- చొప్పున, వ్యక్తులకు 1000/- వంతున అందజేస్తామన్నారు. వ్యవసాయపరంగా జిల్లాలో పంటలు నారుమడి దశలో ఉన్నాయని, నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద విత్తనాలు అందిస్తామన్నారు. రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అన్ని విధాలా ఆడుకుంటుందన్నారు. అదేవిధంగా నగరంలో విద్యుత్ పునరుద్దరణ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News