రేపు మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో తీవ్రవడగాల్పు, 213 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 9 తీవ్రవడగాల్పులు, 276 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఆదివారం ఏలూరు జిల్లా కామవరపుకోట 44.9°C, కృష్ణా జిల్లా కవతవరంలో 44.8°C, గుంటూరు జిల్లా నూతక్కిలో 44.4°C, ఏన్టీఆర్ జిల్లా చందపురంలో 44.4°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. 41 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. మరోవైపు వేసవిలో అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.