Wednesday, October 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan says they are writing Good book not red book: రెడ్‌...

Jagan says they are writing Good book not red book: రెడ్‌ బుక్‌ ఏమైనా పెద్ద విషయమా? మేమైతే గుడ్‌ బుక్‌ రాస్తున్నాం: జగన్

పార్టీ తరపున భరోసా

చీకటి తర్వాత కచ్చితంగా వెలుగు:
మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించాం. ఇక్కడ మితిమీరిన అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి. వారికి పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి. ఆ ఉద్దేశంతోనే ఈసమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. అన్నిటినీ తట్టుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిగారిని ఇన్‌ఛార్జిగా నియమించాం.
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎలా పాలన చేస్తుందో మీ అందరికీ తెలుస్తోంది. నాలుగు నెలలుగా రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటకు వస్తుంది. చీకటి తర్వాత కచ్చితంగా వెలుతురు వస్తుంది.

- Advertisement -

అదేమైనా పెద్ద పనా?:
రెడ్‌బుక్‌ మెయింటైన్‌ చేయడం అనేది ఏమైనా పెద్దపనా?. ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకు వచ్చింది. మేమైతే గుడ్‌బుక్‌ రాసుకోవడం మొదలు పెట్టాం. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లన్నీ రాసుకుంటున్నాం. వారందరికీ తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయి. చంద్రబాబు చెప్పినవన్నీ మోసాలు, అబద్దాలే. మోసం వల్ల ప్రజల కోపం నుంచి పుట్టే ఓటు చంద్రబాబుకి సింగిల్‌ డిజిట్‌ కూడా రాని పరిస్థితి తెస్తుంది.

మన మంచి ప్రతి ఇంట్లో ఉంది:
2019 నుంచి 2024 వరకు ప్రతి ఇంటికీ మనం మంచి చేశాం. ఆ మంచి ప్రతి ఇంట్లోనూ బ్రతికే ఉంది. అందుకే ప్రతి ఇంటికీ మనం గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా పాలన చేస్తూ.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాం. గతంలో మ్యానిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు పెద్ద డాక్యుమెంట్‌ తయారు చేసి, ఆ ఎన్నికలవగానే చెత్తబుట్టలో వేసే సంప్రదాయం. కానీ మొట్టమొదటిసారిగా మ్యానిఫెస్టో అన్నదానికి అర్ధం తీసుకొచ్చిన పాలన మాత్రం కేవలం వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది.
మ్యానిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి అందులో ఇచ్చిన ప్రతి హామీని.. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలండర్‌ కూడా విడుదల చేశాం. ఆ సంక్షేమ క్యాలండర్‌లో ఏ నెలలో ఏ పథకం వస్తుందో ముందుగానే చెప్పి.. ఆ ప్రకారం ప్రతినెలలో క్రమం తప్పకుండా బటన్‌ నొక్కి పథకాలు అమలు చేశాం. ఇది కేవలం ఐదేళ్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పాలనలోనే జరిగింది. గతంలో రాష్ట్రంలోనే కాదు.. బహుశా దేశంలోనే ఈ తరహాలో క్యాలెండర్‌ ఇచ్చి క్రమం తప్పకుండా పథకాలు అమలు చేసిన చరిత్ర లేదు.

అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం:
పథకాల అమలులో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పథకాలు అమలు చేయకుండా ఉండేందుకు చాలా కారణాలు కనిపించాయి. గతంలో చంద్రబాబు చేసిన అప్పులు, మన హయాంలో చేసిన వాటి కన్నా చాలా ఎక్కువ. ఆ అప్పుల బరువు మనం మోశాం. కోవిడ్‌ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. రెండేళ్ల పాటు కోవిడ్‌తో యుద్ధం చేస్తున్న సమయంలో అనూహ్యంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. మరోవైపు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి అనేక పరిస్ధితులు చూశాం.
అయినా ఏరోజు కూడా సాకులు చూపకుండా పథకాలు అమలు చేశాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటీ చేయాల్సిన ధర్మం మన మీద ఉందని నమ్మి అన్నీ నడిపించాం. చిరునవ్వుతోనే పాలన సాగించి, చెప్పిన ప్రతి మాట నెరవేర్చుతూ, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా పాలన చేస్తూ మార్పులు కూడా తీసుకువచ్చాం.

గతంలో చూడని మార్పులు:
స్కూళ్లు, ఆస్పత్రులను సమూలంగా మార్చాం. మంచి వైద్యాన్ని గ్రామాలకే తీసుకు వచ్చాం. ఇంగ్లిషు మీడియం చదువులు, టోఫెల్‌ క్లాసులు, ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ ప్యానెల్స్, ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌ల వంటి మార్పులు చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉచిత పంటల బీమా అమలు చేశాం. రైతులకు ఇ–క్రాప్‌ చేశాం. దళారీ వ్యవస్ధ లేకుండా ఆర్బీకేల ద్వారా రైతుల వద్ద నుంచి కొనుగోళ్లు చేపట్టాం. గతంలో ఎఫ్పుడూ చూడని మార్పులివి.
చివరకు పాలనలో సైతం మార్పులు తెచ్చాం. పాలన అంటే ప్రజల వద్దకు మాత్రమే కాదు.. ప్రజల ఇంటికే పంపించే కార్యక్రమం వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. వివక్ష లేకుండా, రాజకీయాలు చూడకుండా పథకాలు ఇచ్చాం. కేవలం అర్హత మాత్రమే ప్రమాణికంగా తీసుకుని.. మనకు ఓటు వేయని వారికి మీరు ఏ పార్టీ అని కూడా అడగకుండా పథకాలు ఇచ్చాం. ప్రతి ఇంటి గడప వద్దకే పెన్షన్, రేషన్‌ సరుకులతో పాటు, అన్ని పథకాలు అందించాం.
దిశ యాప్‌ ద్వారా అక్కచెల్లెమ్మలకు భద్రత కల్పించాం. ఒకవేళ వారు ఇబ్బందుల్లో ఉంటే దిశ యాప్‌ బటన్‌ నొక్కిన 10 నిమిషాల్లోపే పోలీసులు వచ్చి భద్ర కల్పించేలా చేశాం. ఇవన్నీ గతం.

మరి ఇప్పటి పరిస్థితులు?:
మరి ఇప్పుడు పరిస్థితులు ఏంటో మీరు చూడండి. కేవలం నాలుగు నెలల్లోనే మొత్తం యూటర్న్‌. ప్రతి అడుగులోనూ, ప్రతి విషయంలోనూ తిరోగమనమే కనిపిస్తో్తంది. ప్రతి చోటా వివక్ష, పక్షపాతం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది.
‘జగన్‌ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావూ పోయింది. బిర్యానీ పోయింది’ అనే చర్చ జరుగుతోంది. పథకాల అమలు లేకపోగా, వ్యవస్థలన్నీ పతనం అవుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. బిల్లులు చెల్లించడం లేదు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బిల్లులు దాదాపు రూ.2300 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని పేషెంట్‌ ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎగరగొట్టారు.
ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టగా, ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 5 కాలేజీలు ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉంది. అన్నీ వెనుకడుగే. ప్రభుత్వం ఎందుకు ఉందో అర్థం కావడం లేదు.

పార్టీని మరింత బలోపేతం చేయాలి:
సంస్థాగతంగా అత్యంత బలంగా ఉండాలి. గ్రామ స్ధాయి నుంచి బూత్‌ కమిటీల ఏర్పాటు జరగాలి. ఆ స్ధాయిలో పార్టీ ఏకం కావాలి. మన కార్యకర్తలను, అభిమానులను ఏకం చేయాలి. వారందరి ద్వారా బలమైన పార్టీ నిర్మాణం జరగాలి. ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సన్నద్దంగా ఉంటాం.
మీ అందరికీ ఒక మాట చెబుతాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల నుంచే నాయకులు పుడతారు. కేసులు పెడతారు. జైళ్లకు పంపిస్తారు. నన్ను16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు. ఇంతకంటే దారుణంగా ఎవరినీ వేధించి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం. ప్రజల ఆశీస్సులతో సీఎం అయ్యాను. అందుకే కష్టాలు ఎక్కువ కాలం ఉండవు అని వైయస్‌ జగన్‌ వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News