Lokesh meets PM: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుండి పూర్తి మద్దతు కోరుతూ, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇది ఒక మర్యాదపూర్వక సమావేశం అయినప్పటికీ, రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్య విషయాలపై చర్చలు జరిపారు.
మంత్రి లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి, ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రానికి సెమీ కండక్టర్ యూనిట్ను మంజూరు చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో విద్యారంగంలో జరుగుతున్న సంస్కరణల గురించి వివరించి, ఉన్నత విద్యలో మంచి ఫలితాలు సాధించడానికి కేంద్రం మార్గనిర్దేశం చేయాలని అభ్యర్థించారు.
గత 15 నెలలుగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ‘వికసిత్ భారత్ – 2047’ లక్ష్య సాధనలో ఏపీ భాగస్వామి అవుతుందని స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణల వల్ల దేశంలోని కోట్లాది మందికి మేలు జరిగిందని ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలను కూడా ప్రధానికి వివరించినట్లు సమాచారం.
మంత్రి లోకేశ్ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశం ముగింపులో, లోకేశ్ ‘యోగాంధ్ర’ నిర్వహణపై రూపొందించిన ఒక కాఫీ టేబుల్ బుక్ను ప్రధానికి అందజేశారు.


