తీవ్ర ఉత్కంఠ రేపిన మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్(GVMC)మేయర్ పీఠం కూటమి దక్కించుకుంది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. సమావేశానికి ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. సభ్యులంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా.. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. దీంతో మేయర్ పీఠం కూటమి వశమైంది.
ఒకానొక దశలో ఆధిపత్యంలో ఉన్న వైసీపీ ప్రస్తుతం 59 మంది నుంచి కేవలం 31 మంది కార్పొరేటర్లకే పరిమితమైంది. మరోవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మైత్రి కూటమి బలంగా ఎదుగుతోంది. టీడీపీ కార్పొరేటర్లు సంఖ్య 48కు చేరగా, జనసేనకు 14 మంది మద్దతుగా నిలిచారు. ఇక బీజేపీకి ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఇక అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశానికి ముందు రెండు వర్గాలు తమ మద్దతుదారులను క్యాంపుల్లో ఉంచుతూ అప్రమత్తంగా వ్యవహరించాయి. కూటమి కార్పొరేటర్లు మలేసియాకు వెళ్లి శుక్రవారం రాత్రి తిరిగి విశాఖకు చేరుకోగా.. వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరు శ్రీలంక వెళ్లారు.