Good news for farmers: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక శుభవార్తను వెల్లడించింది. రానున్న మూడు నెలల కాలానికి సంబంధించిన వర్షపాతం గురించి పేర్కొంది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అనుకున్న సమయం కంటే ముందే ఈశాన్య రుతుపవనాలు రానున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్గా వాతావరణ శాఖ పరిగణిస్తుంది. ఈ మూడు నెలల్లో దీర్ఘకాల సగటుతో పోలిస్తే ఏకంగా 112 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారలు తెలిపారు. ముఖ్యంగా అక్టోబరు నెలలో వర్షపాతం 115 శాతం వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. అక్టోబరులో హిందూ మహాసముద్రం మీద అల్పపీడనం.. ఆసియా ఖండంలోని సైబీరియా ప్రాంతంలో అధిక పీడనం కేంద్రీకృతమవుతాయి. దీంతో ఈశాన్య రుతుపవనాలు ఏర్పడతాయి. వీటినే తిరోగమన రుతుపవనాలని అంటారు.
ముందే రానున్న ఈశాన్య రుతుపవనాలు: సాధారణంగా ఈ రుతుపవనాల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, పుదుచ్చేరి, కేరళతో పాటు ఏపీలోనికోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. వివిధ వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం అక్టోబరు 17 నుంచి 21వ తేదీ మధ్య ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిన వెంటనే ఈశాన్యం పవనాలు సైతం కరుణించనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rain-warnings-issued-for-cyclone-ap/
సీమలో వర్షాలు: సీమ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న 24 గంటల్లో సీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అన్నారు. అల్పపీడనం ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు.


